Bangladesh Elections: బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం-తొలిసారి బోణీ..!
బంగ్లాదేశ్ (Bangladesh)లో తాజాగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. గతేడాది మాజీ ప్రధాని షేక్ హసీనాను జెన్ జీ తిరుగుబాటుతో గద్దె దింపిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారు. దీంతో తారిఖ్ రహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ 209 సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది. బీఎన్పీకి గట్టి పోటీ ఇస్తుందని భావించిన అతివాద జమాతే ఇస్లామీ పార్టీ చతికిలపడింది. అదే సమయంలో ఈ ఎన్నికల్లో మరో అనూహ్య ఫలితం నమోదైంది.
బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి ఒక సీటు గెల్చుకుని బోణీ కొట్టింది. అయితే ఇది మన భారతీయ జనతా పార్టీ కాదు. బంగ్లాదేశ్ జాతీయ పార్టీ (BJP). ఈ బీజేపీకీ, భారత్ తో ఎలాంటి సంబంధం లేదు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో అందలీవ్ రెహమాన్ పార్థో అనే అభ్యర్ధి బీజేపీ తరపున పోటీ చేసి భోలా-1 నియోజకవర్గం నుండి గెలిచారు. అయితే బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ఈ బీజేపీ మిత్రపక్షంగా పోటీ చేసింది. ఈ గెలుపుతో అధికార కూటమిలో భాగస్వామి కాబోతోంది.

భారత్ కు బంగ్లా కొత్త తలనొప్పి ? తేడా వస్తే సీన్ రివర్స్..!
బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించిన 297 సీట్ల ఫలితాల ప్రకారం, బీఎన్పీ, దాని మిత్రదేశాలు 212 సీట్లను గెలుచుకున్నాయి. ఒక్క బీఎన్పీ మాత్రమే 209 సీట్లను గెలుచుకుంది. అలాగే దాని పక్షాల్లో గనోసంహతి ఆందోళన్, బంగ్లాదేశ్ జాతీయ పార్టీ (బిజెపి), గోనో ఓధికార్ పరిషత్ ఒక్కొక్క సీటును గెలుచుకున్నాయి. మరోవైపు జమాత్, దాని మిత్రపక్షాలు 77 సీట్లను గెలుచుకున్నాయి. ఇందులో జమాత్ 68 సీట్లను గెలుచుకోగా, నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సిపి) ఆరు సీట్లను గెలుచుకుంది. మొత్తం 50 రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. 273 మంది స్వతంత్రులు సహా 2,028 మంది అభ్యర్థులు పోటీ చేశారు.












Click it and Unblock the Notifications