ఓ 10 ని.లు ఇలా చేస్తే ప్రశాంతత, అమెరికా కాలేజీ పరిశోధనలో తేలింది
న్యూయార్క్: మెడిటేషన్ (ధ్యానం) ప్రశాంతత, దృఢచిత్తం, మానసిక సత్ప్రవర్తనకు ఉపయోగపడుతుందని మనం చదువుతుంటాం. ధ్యానంను పురాతన కాలం నుంచి సాధన చేస్తున్నారు. ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని తాజాగా మరో సర్వేలో తేలింది.
ఒక పనిని ఎక్కువసేపు చేయడం, కష్టమైన పని చేస్తున్నప్పుడు మెదడు కొంచెం మొద్దుబారిపోయినట్లు అనిపించడం సహజమే. అలాంటి సమయంలో మెడిటేషన్ చేస్తే మెదడు చురుగ్గా పని చేస్తుందని తాజా సర్వేలో తేలిందట. ప్రతి రోజు మెడిటేషన్ చేసే వాళ్లు, కొత్తగా సాధన చేసేవారు ఎవరికైనా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
అమెరికాకు చెందిన యాలే యూనివర్సిటీ, స్వర్త్ మోర్ కాలేజీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కొంతమంది విద్యార్థులకు మెడిటేషన్కు సంబంధించిన ఆడియోలను పది నిమిషాలు వినిపించారు. పరీక్షల్లో వారు చక్కటి ప్రతిభ కనబర్చారట. క్లాస్ రూం సబ్జెక్టులనే విన్న వారు అంతగా రాణించలేకపోయారట.
కాలేజీని రెండు బృందాలుగా విభజించి ఓ గ్రూప్కు మెడిటేషన్ ఆడియోలు, మరో గ్రూప్కు టెస్టుకు సంబంధించిన ఆడియోలు వినిపించారు. మెడిటేషన్ ఆడియోలు విన్న వారు ఎక్కువ చురుగ్గా ప్రవర్తించారు. మెడిటేషన్ వల్ల చురుగ్గా ఉంటారని వెల్లడైంది.