బిగ్ షాక్ : రాయల్ టైటిల్ వదులుకున్న బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ..!
అమెరికాలో సంచలనం రేపిన లైంగిక దోపిడీ కేసు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యాపారవేత్తకు సంబంధించిన ఈ పత్రాల్లో.. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్ వంటి ప్రముఖుల పేర్లు బయటపడ్డ విషయం తెలిసిందే. మొత్తం మీద దాదాపు 200 మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ పత్రాలలో ఉన్నారని అమెరికా మీడియా వెల్లడించింది.
రాయల్ కుటుంబానికి బిగ్ షాక్..
అయితే ఈ జాబితాలో బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ పేరు కూడా ఉండడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయం సామాన్యులకే కాకుండా రాయల్ కుటుంబానికి కూడా ఊహించని షాక్ ఇచ్చింది. రాయల్ కుటుంబం ప్రతిష్ఠ దెబ్బతింటుందని భావించి.. ఆయన తన టైటిల్ 'డ్యూక్ ఆఫ్ యార్క్'ను వదులుకున్నట్టు సమాచారం. బ్రిటన్ రాజు చార్లెస్ III ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని మీడియా పేర్కొంది.

కాగా ప్రిన్స్ ఆండ్రూ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. తనపై ఉన్న ఆరోపణలు రాజ కుటుంబ గౌరవానికి నష్టం చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ఇకపై తన బిరుదును, దానికి సంబంధించిన గౌరవాలను ఉపయోగించబోనని పేర్కొన్నారు.
అమెరికా చరిత్రలో అతిపెద్ద లైంగిక దోపిడీ..
ఇక జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికాలో అత్యంత ధనవంతులైన ఫైనాన్షియర్లలో ఒకరు. 2019లో జైలులో మరణించే వరకు ఆయనపై అనేక లైంగిక దోపిడీ కేసులు నమోదయ్యాయి. ఆయన పేద, మధ్యతరగతి బాలికలను ఆకర్షించడానికి మోడలింగ్ అవకాశాలు, భారీ మొత్తాల ఆఫర్లు ఇచ్చేవాడని బాధితులు వాంగ్మూలాలు ఇచ్చారు. అనంతరం వారిని ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోలోని తన విలాసవంతమైన నివాసాలకు పిలిపించి లైంగిక దోపిడీకి గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వెలుగులోకి కొత్త పత్రాలు..
లేటెస్ట్ గా కోర్టు ఆదేశాల మేరకు విడుదలైన ఈ పత్రాలు.. 2015లో ఎప్స్టీన్ సహచరురాలు గిస్లేన్ మ్యాక్స్వెల్పై దాఖలైన కేసుకు సంబంధించినవే. ఈ పత్రాల్లో ఉన్న పేర్లలో రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు, ఫిల్మ్ సెలబ్రిటీలు ఉన్నారని అమెరికన్ మీడియా తెలిపింది. అయితే న్యాయశాఖ ప్రకారం, "పత్రాల్లో పేరు ఉందంటే అది తప్పనిసరిగా నేరం చేసినట్లు కాదు, విచారణ కొనసాగుతోంది" అని స్పష్టం చేసింది.
జొహన్నా సోబెర్గ్ సంచలన ఆరోపణలు..
ఈ కేసులో ప్రధాన బాధితురాలిగా జొహన్నా సోబెర్గ్ ఇచ్చిన వాంగ్మూలం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. 2001లో న్యూయార్క్లోని ఎప్స్టీన్ నివాసంలో ఓ గ్రూప్ ఫోటో తీసుకునే సమయంలో ప్రిన్స్ ఆండ్రూ తనను అసభ్యంగా తాకాడని పేర్కొన్నారు. అంతేకాకుండా తన వాంగ్మూలంలో బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ పేర్లను కూడా ప్రస్తావించడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.
మరోవైపు ఈ పత్రాల్లో బిల్ క్లింటన్, ట్రంప్ పేర్లు రావడంతో రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు జెఫ్రీ ఎప్స్టీన్ 2019లో జైలులో మరణించాడు. అధికారికంగా అది ఆత్మహత్యగా ప్రకటించబడినప్పటికీ.. మృతిపై అనేక అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications