ఔటైతేనే ఉపశమనం: సచిన్పై బ్రిటన్ ప్రధాని
కోల్కతా: తన చివరి టెస్టు మ్యాచు ఆడుతున్న బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రశంసించారు. సచిన్ టెండూల్కర్ భారత్ కోసం చివరిసారి బ్యాట్తో బరిలోకి దిగుతున్నాడని అన్నారు. ఆయన గురువారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా నగరంలో పర్యటించారు. సచిన్ టెండూల్కర్ తన చివరిదైన 200వ టెస్టు మ్యాచు ఆడుతున్న సందర్భంగా ఆయన స్పందించారు. కోల్కతాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. గురువారం సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్కు దిగే ముందు ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం చివరిసారిగా సచిన్ టెండూల్కర్ బ్యాట్తో బరిలో దిగుతున్నాడని అన్నారు. దేశం కోసం 24ఏళ్లుగా సచిన్ సేవలందిస్తున్నారని అన్నారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు తాను తమ దేశ జట్టు ఆటగాళ్లకే మద్దతు పలుకుతానని, సచిన్ టెండూల్కర్ ఎప్పుడైతే ఔట్ అవుతాడో అప్పుడు తనకు ఉపశమనంగా ఉంటుందని చెప్పి నాలుక్కరచుకున్నారు.
కొందరు విద్యార్థులు ఈ సందర్భంగా కామెరాన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. సచిన్ టెండూల్కర్ అత్త బ్రిటిష్ జాతీయురాలు కాబట్టి సచిన్ కుమారుడు ఇంగ్లండ్ తరపున ఆడవచ్చు అని అన్నారు. సచిన్ టెండూల్కర్ ఒక గొప్ప ఆటగాడని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.
అంతకుముందు భారత ప్రధాని మన్మోహన్ సింగ్తో భేటియైన సందర్భంలోనూ సచిన్ టెండూల్కర్ గురించి చర్చకు వచ్చింది. సచిన్ సంతకం చేసిన బ్యాట్ తన వద్ద ఉందని, అది తనకు అమూల్య నిధితో సమానమని కామెరాన్ తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటు ఎగువ సభలో సభ్యుడని, ఇక నుంచి సచిన్ను సభలో చూడాలని తన సహచరులు కోరుకుకుంటున్నారని ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.