పాక్ కు చుక్కలు చూపించబోతున్న భారత్..! ఇక ఆకాశంలోనూ, సముద్రంలోనూ..!
కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను భారత్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గత వారం సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పాకిస్తాన్ తో ఉన్న సింధు జలాల ఒప్పందం నిలిపివేత, పాకిస్తాన్ పౌరుల బహిష్కరణ సహా పలు కీలక నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్రం సిద్దమవుతోంది.
ఇందులో భాగంగా రేపు ప్రదాని మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పాకిస్తాన్ పై తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై చర్చించబోతోంది. ఇందులో పాకిస్తాన్ విమానాలకు మన గగనతలం మూసేయడంతో పాటు భారత తీరంలోని పోర్టులకు ఆ దేశ నౌకల రాకపోకలపై పూర్తిస్దాయిలో నిషేధం విధించడం వంటివి ఉన్నాయి. గగనతలం మూసివేత వల్ల పాకిస్తాన్ విమానయాన సంస్థలు చైనా లేదా శ్రీలంక వంటి దేశాల మీదుగా కౌలాలంపూర్ వంటి ఆగ్నేయాసియా గమ్యస్థానాలకు వెళ్లే విమానాలను దారి మళ్లించాల్సి వస్తుందని తెలుస్తోంది.

వాస్తవానికి ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ప్రతీకార చర్యలకు భయపడి పాకిస్తాన్ విమానాలు ఇప్పటికే భారత గగనతలాన్ని తప్పించుకోవడం ప్రారంభించాయి. ఇప్పుడు భారత్ అధికారికంగా తమ గగనతలాన్ని మూసేస్తే ఆయా విమానాలు చైనాను చుట్టి వెళ్లక తప్పదు. మరోవైపు పాకిస్తాన్ ఇప్పటికే తమ గగనతలాన్ని భారత విమానాలు రాకుండా మూసేసింది. దీంతో భారత విమానాలు కూడా చుట్టు తిరిగి వెళ్లక తప్పడం లేదు. ఇప్పుడు దీనికి కౌంటర్ గా భారత్ తమ గగనతలం మూసివేయనుంది. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాల్ని రేపు కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకోబోతోంది.












Click it and Unblock the Notifications