డోక్లాం వివాదం: భారత్లోని చైనీయులకు ఆ దేశం హెచ్చరికలు
డోక్లాం వివాదం నేపథ్యంలో భారత్, చైనాల మధ్య గత రెండు నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో మరోసారి భారతదేశంలోని చైనాయులను ఆ దేశం మరోసారి హెచ్చరించింది.
బీజింగ్/న్యూఢిల్లీ: డోక్లాం వివాదం నేపథ్యంలో భారత్, చైనాల మధ్య గత రెండు నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో మరోసారి భారతదేశంలోని చైనాయులను ఆ దేశం మరోసారి హెచ్చరించింది. ఈ మేరకు ఢిల్లీలోని చైనా ఎంబసీ నుంచి ఈ అడ్వైజరీ జారీ చేశారు. డోక్లాం ఉద్రిక్తత నేపథ్యంలో చైనా ఇలా హెచ్చరికలు జారీ చేయడం రెండోసారి కావడం గమనార్హం.
అంతకుముందు నెలరోజులపాటు అంటే ఆగస్టు 7వరకూ ఈ అడ్వైజరీ వర్తిస్తుందని పేర్కొంది. జులై 8 తర్వాత తాజాగా గురువారం మరోసారి హెచ్చరికలను జారీ చేసింది.డిసెంబర్ 31 వరకు ఈ అడ్వైజరీ వర్తించనుందని చైనా ఎంబసీ తెలిపింది. ఈ అడ్వైజరీ ప్రకారం.. చైనా ప్రజలు భారత్లో అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించింది.
అంతేగాక, 'భారత్లో ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, రోగాలు తరచుగా ఉంటాయి. వీటితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత భద్రతను పెంపొందించుకోవాలి. స్థానిక మతాచారాలు, సంప్రదాయాలకు గౌరవం ఇవ్వండి' అని పేర్కొంది. డోక్లాం వివాదం నేపథ్యంలో చైనా తన ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు ఈ అడ్వైజరీలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
చైనా యుద్ధానికి సిద్ధమంటూ ఇప్పటిక పలుమార్లు భారత్ను హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా, భారత్ కూడా తాము వెనక్కి తగ్గేది లేదని చైనాకు స్పష్టం చేసింది. చైనా పలుమార్లు సరిహద్దు ప్రాంతంలో యుద్ధ విన్యాసాలు కూడా చేసింది. దీంతో భారత్ కూడా సరిహద్దు ప్రాంతంలోకి భారీగా భద్రతా దళాలను తరలించింది. దీంతో గత రెండు నెలల కాలంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.