చంద్రుడిపై జెండా పాతిన చైనా... 2030 నాటికి అదే టార్గెట్ అని ప్రకటన...
ప్రపంచ సూపర్ పవర్గా ఎదుగుతున్న చైనా మరో ఘనతను సొంతం చేసుకుంది. అంతరిక్షంలో చంద్రుడిపై తమ జెండా పాతింది. 50 ఏళ్ల క్రితం అమెరికా ఈ ఘనత సాధించిన తొలి దేశంగా చరిత్ర పుటల్లోకి ఎక్కగా... ఆ ఫీట్ సాధించిన రెండో దేశంగా చైనా నిలిచింది. చంద్రుడిపై జెండాకు సంబంధించిన ఛాయా చిత్రాలను చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసింది. ఆ జెండా పొడవు 90సెం.మీ పొడవు,2మీటర్ల వెడల్పు ఉంది.
చంద్రుడిపై జెండా పాతడమే కాదు... అక్కడి రాళ్లను కూడా తీసుకురానుంది చైనా. ఇందుకోసం నవంబర్ 23వ తేదీన వెన్చాంగ్ స్పేస్క్రాఫ్ట్ సైట్ నుంచి లాంగ్ మార్చ్ 5 రాకెట్ మిషన్ను చేపట్టింది. ఈ మిషన్ ద్వారా మంగళవారం(డిసెంబర్ 1) చంద్రుడిపై చైనా రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా అడుగుపెట్టింది. దీంతో అమెరికా,రష్యా తర్వాత ఈ ఘనత సాధించిన మూడో దేశంగా రికార్డుల్లోకి ఎక్కింది.
ఈ రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్లో నాలుగు ప్రధాన ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి. చంద్రునిపై 2 నుంచి 4కి.గ్రా ధూళిని సేకరించడంలో ఇవి కీలకంగా పనిచేశాయి. భవిష్యత్తులో అంగారక గ్రహంపై కూడా ఈ తరహా మిషన్ చేపట్టేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అంగాకరకుడి పైకి చైనా ఓ స్పేస్ క్రాఫ్ట్ని పంపించింది. వచ్చే ఏడాది మే నెలలో అది అంగారకుడిని చేరే అవకాశం ఉంది. ఒకవేళ ఆ ప్రయోగం విజయవంతమైతే... అంగారకుడి పైకి స్పేస్ క్రాఫ్ట్ని పంపిన మూడో దేశంగా చైనా నిలవనుంది. 2030లో ఆ స్పేస్ క్రాఫ్ట్ అంగారకుడి నుంచి మట్టి లేదా ఏదైనా వస్తువులను తీసుకొస్తుందని చైనా భావిస్తోంది. అంతేకాదు,ఈ దశాబ్దం చివరి నాటికి చంద్రుడిపైకి మనిషిని పంపించి అక్కడే శాశ్వత ఆవాసం ఏర్పరిచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చైనా వెల్లడించడం గమనార్హం.
కాగా, ప్రపంచ చరిత్రలో తొలిసారిగా 1969లో అమెరికా చంద్రుడిపై జెండా పాతిన సంగతి తెలిసిందే. అపోలో 11 మిషన్లో వెళ్లిన వ్యోగాములు ఆ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తర్వాత 1972 వరకు మరో ఐదు జెండాలను అమెరికా చంద్రుడిపై అమెరికా పాతింది.