చైనా షాకింగ్: అక్సాయ్ చిన్ లో అలజడి - లదాక్ నుంచి పూర్తిగా వెనక్కి - టీ90 యుద్ధ ట్యాంకులతో భారత్
చైనా బుద్ధి వంకర అని మరోసారి రుజువయ్యేలా షాకింగ్ అంశాలు వెల్లడయ్యాయి. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కి సమీపంలోని తూర్పు లదాక్ నుంచి తన బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన డ్రాగన్ దేశం.. మరోవైపు అక్సాయ్ చిన్, టిబెట్ ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించింది. డ్రాగన్ మోసకారి విధానాలను ముందే పసిగట్టిన భారత్ ఇప్పటికే భారీ యుద్ధ సామ్రానికి సరిహద్దులకు తరలించినట్లు వెల్లడైంది.

ఎల్ఏసీ దగ్గర ఎవరూ లేరు..
లెఫ్టినెంట్ జనరళ్ల స్థాయి సమావేశాల్లో.. బలగాల ఉపసంహరణకు అంగీకారం కుదిరిన తర్వాత కూడా తూర్పు లదాక్ నుంచి డ్రాగన్ సైన్యాలు వెనుదిరగలేదంటూ ఇటీవల రిపోర్టులు వచ్చాయి. దీనిపై చైనా విదేశాంగ శాఖ స్పందించింది. ఎల్ఏసీకి దగ్గరగా తమ బలగాలు లేవని, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిందని, గ్రౌడ్ లెవల్ లో ప్రస్తుతానికి ఉద్రిక్తతలేవీ లేవని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ తెలిపారు. బీజింగ్ లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.

ఎల్జే స్థాయిలో 5వ రౌండ్ చర్చలు..
ఈ ఏడాది మే మొదటి వారం నుంచి జులై మొదటి వారం దాకా భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడం, తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో ఇరు సైన్యాలు బాహాబాహీకి దిగడం, జూన్ 15న గాల్వాన్ లోయలోని 14వ పెట్రోలింగ్ పాయింట్(పీపీ14) వద్ద చోటుచేసుకున్న హింసలో మన జవాన్లు 21 మంది చనిపోవడం తెలిసిందే. ఉద్రిక్తతల్ని తగ్గించి, తిరిగి స్టేటస్ కో నెలకొల్పే దిశగా లెఫ్టినెంట్ కమాండర్ల స్థాయిలో జరిగిన చర్చలు ఫలించాయి. చివరిగా ఈనెల 14న జరిగిన చర్చల్లో పూర్తిస్థాయి డీఎస్కలేషన్ కు రెండు దేశాలు అంగీకరించాయి. కాగా, ఆ ప్రక్రియ పూర్తయిందని చైనా ప్రకటించిన నేపథ్యంలో 5వ రౌండ్ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్ఏసీ నుంచి 3కిలోమీటర్ల మేర బఫర్ జోన్ లో తదుపరి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనేదానిపై ఇరు దేశాల సైనికాధికారులు చర్చించనున్నారు. ఇదిలా ఉంటే,

అక్సాయ్ చిన్ లో అలజడి..
తూర్పు లదాక్ లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయనుకునేలోపే డ్రాగన్ తన బుద్దిని మరోసారి చూపించుకుంది. కీలకమైన అక్సాయ్ చిన్ తోపాటు టిబెట్ సరిహద్దుల్లో భారీగా సైనిక బలగాలను మోహరించినట్లు, తాత్కాలిక నిర్మాణాలను ఏర్పాటు చేస్తున్నట్లు శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైంది. ఆ రెండు ప్రాంతాల్లో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కి చెందిన సుమారు 50 వేల మంది సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే శీతాకాలంలో దాడులు జరిపేలా చైనా ప్లాన్ సిద్ధం చేస్తున్నదని, అందులో భాగంగా ఈనెల 21న టిబెట్లోని షిక్వాన్హే నుంచి బలగాలను సరిహద్దు వైపునకు తరలించిందని శాటిలైట్ ఇమేజ్ ల ద్వారా బయలుపడింది. రక్షణ వ్యవహారాలను విశ్లేషించే పలు సంస్థలు ఈ మేరకు సమాచారాన్ని బహిర్గతం చేశాయి.

భారత్ దూసుకొస్తుందనే భయంతో..
చరిత్ర పొడవునా భారత్ లో అంతర్భాగంగా ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని 1962 యుద్ధం తర్వాత చైనా ఆక్రమించింది. పశ్చిమ సెక్టార్లోని ఈ ప్రాంతంతోపాటు పాక్ ఆధీనంలోని కాశ్మీర్ కూడా ఇండియాదే అని, త్వరలోనే వాటిని స్వాధీనం చేసుకుంటామని గతేడాది ఆగస్టులో భారత ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటించిన దరిమిలా చైనా జాగ్రత్త చర్యలకు దిగింది. అందులో భాగంగానే, గాల్వాన్ లోయ నుంచి అక్సాయ్ చిన్ కు చేరుకునే మార్గం ఉండటంతో దాన్ని బ్లాక్ చేసేందుకే చైనా హింసకు తెగబడినట్లు వెల్లడైంది.
Recommended Video

డ్రాగన్ కు దీటుగా మనం..
అక్సాయ్ చిన్ లో చైనా సైన్యం కదలికల నేపథ్యంలో ఒకవేళ ఏదైనా జరిగితే దీటైన జవాబు ఇచ్చేందుకు భారత్ సమాయత్తమవుతున్నట్లు, ఈశాన్య రాష్ట్రాల నుంచి రిజర్వ్ బలగాలను సమీకరిస్తోన్నట్లు సమాచారం. కార్గిల్ లో పాకిస్తాన్ మాదిరిగా, ఇటు వైపు నుంచి చైనా దురాక్రమణకు పాల్పడవచ్చనే అంచనాల నేపథ్యంలో.. షాక్స్ గావ్- కరాకోరం పాస్ నుంచి చైనా దురాక్రమణను నివారించడానికి కీలకమైన దౌలత్ బేగ్ ఓల్డి (డీబీవో) వద్ద టీ 90 యుద్ధ ట్యాంకులతోపాటు దాదాపు 4వేల మంది బలగాలను భారత్ రంగంలోకి దించినట్లు సైనిక వర్గాల సమాచారం. ఇటీవల గల్వాన్ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతానికి సమీపంలో 16 వేల అడుగుల ఎత్తులో డీబీవో ఉంది. భారత్ సరిహద్దులో ఉన్న చివరి సైనిక అవుట్పోస్టు ఇదే కావడం గమనార్హం. ఈ అంశాలు సంబంధించి అధికారిక ప్రకటనలు రాలేదు.












Click it and Unblock the Notifications