ఛీఛీ..ఇదేం చెండాలం: టార్గెట్స్ రీచ్ కాకపోతే మూత్రం తాగిస్తారా..?
మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారా..? పనిచేస్తున్నట్లయితే అక్కడ టార్గెట్స్ ఉంటాయా..? మీరు నిర్దేశించిన లక్ష్యాలను అందుకోకపోతే యాజమాన్యం వైఖరి మీపట్ల ఎలాగుంటుంది.. మహా అయితే మరో రోజులో లక్ష్యాలు పూర్తిచేయాల్సిందిగా ఆదేశిస్తారు.. లేదా ఓ మాట అని వదిలేస్తారు. కానీ చైనాలోని ఓ సంస్థ మాత్రం టార్గెట్స్ను అందుకోకపోతే అక్కడి సిబ్బందికి ఓ వింత శిక్ష విదిస్తోంది. దీంతో అక్కడి సిబ్బంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంతకీ ఆ కంపెనీ విధించే వింత శిక్ష ఏమిటో తెలిస్తే మీరు నోళ్లెల్లబెడటం ఖాయం.
సేల్స్ టార్గెట్ అందుకోకపోతే మూత్రం తాగిస్తున్నారు
నైరుతీ చైనా ప్రాంతంలోని ఓ హోమ్ ఇంప్రూవ్ మెంట్ సంస్థ తమ ఉద్యోగులకు వింత శిక్ష విధిస్తోంది. తమకు నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడంలో విఫలమైనందుకు వారిచే మూత్రం తాగించింది. అంతేకాదు బొద్దింకలు కూడా వారితో తినిపిస్తోంది. ఇంతేనా అనుకునేరు... బెల్టుతో నాలుగు దెబ్బలు కూడా వారి వీపుపై వేస్తోంది. గుజౌ ప్రావిన్స్లోని జున్యిలో ఈ కంపెనీ ఉంది. ఇలా టార్గెట్ అందుకోవడంలో విఫలమైన ప్రతీ సారీ సిబ్బందికి ఈ తరహా శిక్షలు విధిస్తోంది. చూసినంత కాలం చూసిన ఉద్యోగులు.... ఓపిక నశించి తమ బాధలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అసలు సంగతి బయట పడింది.
మూత్రం తాగుతున్న సన్నివేశంను రికార్డు చేసిన సిబ్బంది
ఇలానే ఒకరోజు కంపెనీ నిర్దేశించిన లక్ష్యాలను సిబ్బంది ఎవరైతే అందుకోవడంలో విఫలమయ్యారో వారందరిని లైన్లో నిల్చోబెట్టి ఒక్కొక్కరి చేత మూత్రం తాగిస్తుండగా మరో ఉద్యోగి ఆ సన్నివేశాన్ని తన ఫోన్ కెమెరాలో రికార్డు చేశాడు. అంతేకాదు ఇందులో ఉద్యోగిని బెల్టుతో కొడుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. ఆఫీసులో అందరి ముందు ఇలా దండిస్తుండటంతో కన్నీటి పర్యంతమయ్యారు ఉద్యోగులు. ఇక బెల్టుతో దండిస్తున్నది మరెవరో కాదు.. ఆ కంపెనీ మేనేజర్.
సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన సిబ్బంది
ఇక కంపెనీ యాజమాన్యం చేష్టలకు విసిగెత్తిపోయిన ఉద్యోగులు చైనాలోని ప్రముఖ సోషల్ మీడియా సైట్ వెబోపై ఈ రికార్డయిన వీడియోను పోస్ట్ చేశారు. తమ కంపెనీలో జరుగుతున్న అరాచకాలను ప్రపంచ దృష్టికి తీసుకొచ్చారు. మొత్తానికి వీడియో వైరల్ అవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వెంటనే విచారణ చేపట్టారు. ఈ ఘటనతో సంబంధమున్న ముగ్గురు మేనేజర్లను పోలీసులు అరెస్టు చేశారు.
సేల్స్ అందుకోవడం విఫలమైతే టీమీ లీడ్ మూడు బొద్దింకలు తినాలట
మూత్రం తాగుతున్న వీడియోను సోషల్ మీడియాలో దాదాపు 5లక్షల40వేల మంది చూశారు. అంతేకాదు టార్గెట్స్ను అందుకోవడంలో విఫలమైనందుకు తమ కంపెనీ విధించే శిక్ష ఇది అంటూ కొన్ని వాక్యాలు రాశారు. ఇదిలా ఉంటే ఈ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించినప్పటికీ... ఓ న్యూస్ పోర్టల్ మాత్రం దీన్ని డౌన్లోడ్ చేసి, ఆ వీడియోను స్క్రీన్ షాట్స్ తీసి ఫోటోలుగా మార్చి పోస్ట్ చేసింది.అంతేకాదు సేల్స్ టార్గెట్ అందుకోవడంలో ఫెయిల్ అయితే టీమ్ లీడర్ మూడు బొద్దింకలు తినాల్సిందిగా యాజమాన్యం ఆదేశించినట్లు ఆ న్యూస్ పోర్టల్ వెల్లడించింది. అయితే ఇది చూసిన నెటిజెన్లు ఉద్యోగులు కంపెనీని ఎందుకు వీడటం లేదని ప్రశ్నించారు. అప్పటికే కంపెనీ తమకు రెండు నెలల జీతం ఇవ్వాల్సి ఉందని... ఒకవేళ కంపెనీ వీడితే జీతం ఇవ్వమని బెదిరించిందని ఓ ఉద్యోగస్తుడు సమాధానం ఇచ్చాడు.