చైనా.. దెబ్బకు దెబ్బ: హ్యూస్టన్ కాన్సులేట్ మూసివేతకు ప్రతీకారం: యూఎస్ కాన్సులేట్ క్లోజ్
బీజింగ్: భారత్-చైనా మధ్య తలెత్తిన సరిహద్దు వివాదాల ఫలితంగా వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న యుద్ధ వాతావరణం క్రమంగా సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. ఈ వివాదం కాస్తా అమెరికా-చైనా మధ్య విభేదాలకు కారణమౌతోంది. భేదాభిప్రాయాలకు దారి తీస్తోంది. రెండు దేశాల మధ్య దౌత్యపరంగా ప్రచ్ఛన్న యుద్ధానికి బీజం వేసినట్లు కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు ప్రతీకార చర్యలకు దిగుతున్నారు ఈ రెండు దేశాధినేతలు. ప్రపంచ దేశాలపై చైనా పెత్తనాన్ని సాగించడానికి ప్రయత్నిస్తోందంటూ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.
ప్రపంచాన్ని బానిసలా: ఒక్కసారి మోకరిల్లితే: మన పిల్లలు కూడా చైనా దయాదాక్షిణ్యాల మీదే
హ్యూస్టన్ కాన్సులేట్ కార్యాలయం మూతపడ్డ తరువాత..
గూఢచర్యానికి పాల్పడుతోందని, తమ దేశానికి చెందిన కీలక సమాచారాన్ని తస్కరిస్తోందనే ఆరోపణలతో హ్యూస్టన్లోని చైనా కాన్సులేట్ కార్యాలయాన్ని మూసి వేసింది అమెరికా. హ్యూస్టన్లోని తమ కార్యాలయాన్ని మూసివేసిన 72 గంటల వ్యవధిలో ప్రతీకార చర్యకు దిగింది డ్రాగన్ కంట్రీ. చెంగ్డు సిటీలోని అమెరికా కాన్సులేట్ను మూసివేయాలంటూ ఆదేశాలను జారీ చేసింది. చైనాలోని షించువాన్ ప్రావిన్స్ పరిధిలో ఉంటుందీ నగరం.
1985లో ప్రారంభం..
చైనాలో అభివృద్ధి చెందిన నగరాల్లో ఇదీ ఒకటి. భౌగోళికంగా భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. చాలాకాలం నుంచీ చెంగ్డులో అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం కొనసాగుతోంది. 1985 అక్టోబర్ 16వ తేదీన దీన్ని ప్రారంభించారు. కార్యాలయ భవన సముదాయం లేకపోవడం వల్ల 1993 నుంచి నుంచి చెంగ్డులోని ఓ హోటల్ గదిలో ఈ కాన్సులేట్ జనరల్ కార్యాలయం కొనసాగుతోంది.
ప్రతీకార చర్యగా..
సించువాన్, యున్నన్, గుయిఝౌ, టిబెట్ అటానమస్ రీజియన్, ఛొంగ్క్వింగ్ నగరాలు ఈ కాన్సులేట్ జనరల్ కార్యాలయం పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాంతాలు, ప్రావిన్స్లకు సంబంధించిన అమెరికా విసా వంటి ఇతర కార్యకలాపాలను ఈ కార్యాలయం నుంచే కొనసాగుతున్నాయి. తాజాగా- దీన్ని మూసివేయాలంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు కొద్దిసేపటి కిందటే ఆదేశాలను జారీ చేశారు. అమెరికా హ్యూస్టన్లోని తమ దేశ కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని మూసివేయడానికి ప్రతీకార చర్యగా చైనా ఈ ఆదేశాలను జారీ చేసినట్లు చెబుతున్నారు.
Recommended Video
దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తత..
తాజాగా రెండు దేశాల మధ్య చోటు చేసుకుంటోన్న ఈ తరహా దౌత్యపరమైన ప్రతీకార చర్యలు ఎక్కడిదాకా వెళ్తాయనేది చర్చనీయాంశమౌతోంది. హ్యూస్టన్తో ఆరంభమైన చైనా కాన్సులేట్ జనరల్ కార్యాలయాల మూసివేత.. అక్కడితో ఆగేలా కనిపించట్లేదు. తమ దేశంలో చైనాకు చెందిన మరిన్ని కాన్సులేట్ జనరల్ కార్యాలయాలను మూసివేయడానికి అవకాశాలు లేకపోలేదంటూ మైక్ పాంపియో సంకేతాలను ఇచ్చారు. అదే సమయంలో చెంగ్డులోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం మూసివేత ఆదేశాలు వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.