సరిహద్దు ఉద్రిక్తతల వేళ జీ జిన్పింగ్ కీలక నిర్ణయం: పీఎల్ఏ కమాండర్కు జనరల్ ర్యాంక్ హోదా
బీజింగ్: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నలుగురు మిలిటరీ సీనియర్ అధికారులతోపాటు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ వెస్టర్న్ థియేటర్ కమాండ్కు ర్యాంక్ ఆఫ్ జనరల్ హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
చైనా-భారత్ సరిహద్దులో వివాదాలు జరుగుతున్న సమయంలో చైనా కమాండర్ ఆఫ్ ది పీఎల్ఏ డబ్ల్యూటీసీ జూ కిల్లింగ్ను జనరల్గా ప్రమోట్ చేస్తున్నట్లు జిన్హువా మీడియా వెల్లడించింది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఛైర్మన్ జిన్పింగ్ ఈ ప్రకటన చేసినట్లు పేర్కొంది.
ప్రకటనకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేసినట్లు బీజింగ్ వేదికగా వెల్లడించింది. ఈస్టర్న్ లడఖ్లో ప్రస్తుతం కనిపిస్తున్న ఉద్రిక్తత పరిస్థితుల్లో ఈ పదవులు కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది. జూన్ 25న ఇరుదేశాల అధికారుల మధ్య 22వ సమావేశం జరిగింది. ఇందులో ఇరుదేశాల సరిహద్దు సమస్యలపైనే మరోసారి చర్చించారు.
ఇరుదేశాల విదేశాంగ మంత్రుల సమక్షంలో జరిగినప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోయారు. ప్రస్తుతానికి సరిహద్దు వద్ద పహారా కాస్తూనే శాంతి కోసం పనిచేయాలని తీర్మానించుకున్నారు.
Recommended Video
గాల్వాన్ లోయలో చైనా బలగాలు భారత సైనికులపై గత సంవత్సరం దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 20 మంది భారత జవాన్లు అమరులవగా, 40 మందికిపైగా చైనా సైనికులు మృతి చెందారు. ఆ నాటి నుంచి నేటి వరకు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో చైనా సరిహద్దు వెంబడి బారీగా బలగాలను పెంచుకుంటూ పోతోంది. దీంతో భారత్ కూడా 50వేల మంది సైనికులను సరిహద్దుకు పంపింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం మరింత ఉద్రిక్తతలను పెంచేది ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ి