ఏ మాయ చేసిందో గానీ: కరోనా మరణాలకు బ్రేక్: కోలుకుంటోన్న చైనా: తొలిసారిగా
బీజింగ్: భూగోళం మొత్తానికీ కరోనా వైరస్ రూపంలో చావును సరికొత్తగా పరిచయం చేసిన చైనా ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టే కనిపిస్తోంది. కరోనా సృష్టించిన విధ్వంసాన్ని తట్టుకుని నిలిచింది. తమ దేశంలో కొత్తగా ఈ వైరస్ కారణంగా కొత్తగా మరణాలు ఏవీ నమోదు కాలేదని ప్రకటించింది. చైనాలో కరోనా వల్ల మరణాలు ఆరంభమైన తరువాత ఆ దేశం ఈ ప్రకటన చేయడం ఇదే తొలిసారి.
భారత్-అమెరికా మధ్య కరోనా చిచ్చు:ఆ డ్రగ్ పంపించకపోతే ప్రతీకారం తీర్చుకుంటాం:మోడీకి ట్రంప్ వార్నింగ్
మరణాలకు అడ్డుకట్ట..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి జాబితాలో ఆరంభంలో చాలాకాలం పాటు అగ్రస్థానంలో కొనసాగింది చైనా. వేలాదిగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. వందలాది మరణాలు సంభవించాయి. అలాంటి చైనా తాజాగా ఆరో స్థానానికి పడిపోయింది. వైరస్ సోకి మరణించే వారి సంఖ్యను విజయవంతంగా అడ్డుకట్ట వేయగలిగింది. మంగళవారం నాటికి చైనాలో వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య.. 3331. అదే సమయంలో 81,740 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కొత్త మరణాలేవీ లేవంటూ..
కరోనా వల్ల తమ దేశంలో కొత్తగా మరణాలు నమోదు కాలేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. పొరుగు దేశాల్లో నివసిస్తోన్న చైనీయులు స్వస్థలాలకు చేరుకున్న తరువాత.. తమ దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులు వెల్లడించారు. 24 గంటల వ్యవధిలో కొత్తగా 32 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు.
అమెరికాపై పెను ప్రభావం..
చైనా హ్యూబే ప్రావిన్స్లోని వుహాన్ సిటీలో జన్మించిన ఈ వైరస్.. అమెరికా సహా అభివృద్ధి చెందిన అన్ని దేశాలను అల్లకల్లోలానికి గురి చేస్తోంది. వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య అమెరికాలో 10 వేలను దాటిపోయింది. వైరస్ వల్ల 10,871 మంది మరణించారు. 3,67,004 వరకు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. స్పెయిన్లో 13,341, ఇటలీలో 16,523 మరణాలు సంభవించాయి. ఈ రెండు దేశాల్లో కూడా లక్షకు పైగా పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి.
Recommended Video
ప్రపంచవ్యాప్తంగా 74 వేలు దాటిన మరణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 74,697కు చేరుకుంది. 1,346,566 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అత్యధిక మరణాలు ఇటలీలో సంభవించాయి. స్పెయిన్ ఆ దేశాన్ని అనుసరిస్తోంది. అమెరికాలో సైతం 10 మందికి పైగా మరణించారు. ఫ్రాన్స్, ఇరాన్, బ్రిటన్ ప్రధానంగా ఈ వైరస్ బారిన పడి పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అమెరికాలో రెండు లక్షల మందికి పైగా మరణించే అవకాశం ఉన్నట్లు ఇదివరకే వైట్హౌస్ అధికారులు ఓ అంచనా వేసిన విషయం తెలిసిందే.