మళ్లీ బుస కొట్టిన చైనా: బోర్డర్ వద్ద మూడు గ్రామాల నిర్మాణం: భారత్ కన్నుగప్పి: రీలొకేట్
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద దుందుడుకు చర్యలకు పాల్పడుతూ యుద్ధ వాతావరణానికి తెర తీసిన చైనా కన్ను అరుణాచల్ ప్రదేశ్పై పడింది. లఢక్ వద్ద తన పప్పులేవీ ఉడక్కపోవడంతో ఇక దేశ ఈశాన్య దిక్కు వద్ద వివాదాలకు తెర తీసింది. సరిహద్దుల్లోని బమ్ లా పాస్ వద్ద కొత్తగా మూడు గ్రామాలను నిర్మించింది. ఈ ప్రాంతం మొత్తం వివాదాస్పదమైనదే. అలాంటి చోట భారత్ను రెచ్చగొట్టేలా గ్రామాలను నిర్మించడం పట్ల భారత్ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.
Recommended Video
లఢక్ వద్ద ఘర్షణల సమయంలో..
లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలోనే చైనా ఈ మూడు గ్రామాలను నిర్మించినట్లు శాటిలైట్ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. లఢక్ ఈశాన్య ప్రాంతం వద్ద తలెత్తిన వివాదాలను పరిష్కరించుకోవడానికి భారత ఆర్మీ దృష్టి దృష్టిని కేంద్రీకరించిన సందర్భంలో ఈ రీలొకేట్ చేసినట్లు ఓ ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ పేర్కొంది. దీనిపై ప్రత్యేకంగా ఓ కథనాన్ని ప్రచురించింది. ప్లానెట్ ల్యాబ్స్ చిత్రీకరించిన కొన్ని ఫొటోలను జోడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన తీసిన ఫొటోలు, కిందటి నెల 28వ తేదీన రెండు ఫొటోల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి వివరించింది.
బమ్ లా పాస్ ట్రైజంక్షన్
భౌగోళికంగా భారత్-భూటాన్-చైనాలకు ఆనుకుని ఉంటుంది ఈ బమ్ లా పాస్. దీన్ని ట్రైజంక్షన్గా పిలుస్తుంటారు. టిబెట్ రీజియన్ కిందికి వస్తుంది ఇది. టిబెట్లోని కోనా కంట్రీ, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలను కలిపే రహదారి. తవాంగ్ టౌన్ నుంచి సరిగ్గా 43 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కోనా కంట్రీ. ఈ బమ్ లా పాస్ సమీపంలోని కొంత భూభాగాన్ని ఎవరికీ చెందనదిగా భావిస్తుంటారు. అలాంటి ప్రదేశంలో చైనా.. కొత్తగా మూడు గ్రామాలను నిర్మించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
65 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం
అరుణాచల్ ప్రదేశ్ వద్ద సుదీర్ఘకాలం నుంచీ చైనా దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ 65 వేల చదరపు కిలోమీటర్ల వివాదాస్పద ప్రాంతాన్ని తనదిగా చూపిస్తోంది డ్రాగన్ కంట్రీ. అదే వైఖరిని ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తోంది. ఎవరికీ చెందని ఆ 65 వేల చదరపు కిలోమీటర్ల భూభాగంపైనే వాటిని నిర్మించింది. బమ్ లా పాస్ రహదారికి అయిదు కిలోమీటర్ల దూరంలో వేర్వేరుగా ఆ గ్రామాలను నిర్మించడం పట్ల అరుణాచల్ ప్రదేశ్ ఫ్రాంటియర్ ఆర్మీ విభాగం అధికారులు తమ అసంతృప్తిని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి తెలియజేసినట్లు ఆ వెబ్సైట్ పేర్కొంది.