భారత జవాన్లు పులులు..అనవసరంగా కెలికారు: అమెరికా మీడియా: నిశితంగా పరిశీలిస్తోన్న వైట్హౌస్
వాషింగ్టన్: భారీ ఎత్తున ప్రాణనష్టానికి దారి తీసిన భారత్, చైనా సరిహద్దు ఘర్షణలపై అగ్రరాజ్యం అమెరికా దృష్టి సారించింది. లఢక్ సమీపంలో రెండు దేశాల సైనికుల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై ముందునుంచీ ఓ కన్నేసి ఉంచిన అమెరికా.. మరో అడుగు ముందుకేసింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చడానికి మధ్యవర్తిత్వాన్ని వహించడానికి సిద్ధంగా ఉన్నామని మరోమారు స్పష్టం చేసింది. గాల్వన్ వ్యాలీలో చోటు చేసుకున్న తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది.
నలుగురు కాదు 43 మంది, పలువురు గాయపడ్డారు కూడా, పెరిగిన చైనా జవాన్ల మృతుల సంఖ్య..?
భారత జవాన్లను పులులుగా అభివర్ణించిన మీడియా..
భారత జవాన్లు అమెరికా మీడియా పులులుగా అభివర్ణించింది. చైనా అనవసరంగా భారత పులులను రెచ్చగొట్టిందని పేర్కొంటూ అమెరికన్ మీడియాలో ప్రత్యేక కథనాలు వెల్లువెత్తాయి. తొలుత చైనాకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో వాస్తవాధీన రేఖను దాటుకుని మరీ భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారని పేర్కొంటూ కథనాలను ప్రచురించాయి. భారత జవాన్లను రెచ్చగొట్టేలా పీఎల్ఏ సైనికులు ప్రవర్తించారని స్పష్టం చేస్తూ కథనాలను ప్రచురించాయి.
భారత్..భేష్
చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి భారత్ సానుకూల నిర్ణయాలను తీసుకుంటోందని వాషింగ్టన్ ఎగ్జామినర్ అభిప్రాయపడింది. దీనిపై ఓ ప్రత్యేక కాలంను ప్రచురించింది. ప్రముఖ జర్నలిస్ట్, కాలమిస్ట్ టామ్ రోజన్ ఈ వ్యాసాన్ని రాశారు. భారతీయుల్లో జాతీయ భావాలను పెంపొందించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్యలు తీసుకున్నారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా భారతీయులు దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని తాను రాసిన కాలమ్లో అభిప్రాయపడ్డారు.
సర్జికల్ స్ట్రైక్స్-2 ప్రస్తావన..
గత ఏడాది పాకిస్తాన్ భూభాగంపై భారత వైమానిక దళం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ను కూడా ఆయన ప్రస్తావించారు. పుల్వామా జిల్లాలోని అవంతిపురా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై నిర్వహించిన ప్రాణాంతక దాడి అనంతరం చోటు చేసుకున్న ఈ సర్జికల్ స్ట్రైక్స్.. భారతీయుల్లో దేశం పట్ భక్తిభావాన్ని పెంపొందించిందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ప్రవర్తించిందని, భారత జాతీయ పులులను రెచ్చగొట్టిందని రాసుకొచ్చారు. సరిహద్దు వివాదం విషయంలో చైనా దుందుడుకుగా వ్యవహరించి ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
నిశితంగా పరిశీలిస్తున్నాం..
మరోవంక- భారత్ చైనా మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సరిహద్దు ఘర్షణల్లో రెండు వైపులా ప్రాణనష్టం సంభవించడం సరైనది కాదని పేర్కొన్నారు. అమర జవాన్లకు నివాళిని అర్పిస్తున్నట్లు చెప్పారు. సరిహద్దు వివాదాలను శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవాల్సిన అవసరం మరోసారి రెండు దేశాల తలుపు తట్టిందని అన్నారు. ఉద్రిక్తతలను చల్లార్చడానికి తక్షణ చర్యలను తీసుకోవాలని చెప్పారు.
Recommended Video
మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ..
భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను నివారించడానికి మధ్యవర్తిత్వాన్ని వహించడానికి సిద్ధంగా ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇదివరకే ఓ స్పష్టమైన ప్రకటన చేశామని గుర్తు చేశారు. జూన్ 2వ తేదీ నాడు తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధానమంత్రితో టెలిఫోన్లో సంభాషించారని, సరిహద్దు వివాదం అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారని వైట్హౌస్ అధికార ప్రతినిధి తన ప్రకటనలో స్పష్టం చేశారు. సరిహద్దు ఘర్షణలను తక్షణ ప్రాధాన్యత కింద తీసుకోవాలని సూచించారు.