అమెరికా-చైనా మధ్య స్పై బెలూన్ చిచ్చు-మూడు బస్సుల సైజులో-బైడెన్ మంత్రి టూర్ రద్దు !
చైనాకు చెందినదిగా చెప్తున్న నిఘా బెలూన్ అమెరికాలోని అణుకేంద్రాలపై తిరుగుతుండటం ఇరుదేశాల మధ్య చిచ్చు రేపుతోంది. దీంతో చైనాలో పర్యటించాల్సిన బైడెన్ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెనక్కి తగ్గారు.
అమెరికాలోని అణు కేంద్రాల్ని లక్ష్యంగా చేసుకుని చైనాకు చెందిన ఓ నిఘా బెలూన్ గత కొద్ది రోజులుగా ఆకాశంలో సంచరిస్తోంది. ఇది రసాయన ఆయుధాల్ని కూడా మోసుకుని వచ్చినట్లు అమెరికా అనుమానిస్తోంది. దీంతో తొందరపడి దీన్ని కూల్చేందుకగు సాహసించలేకపోతోంది. దీనిపై అంతర్జాతీయ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. అయినా ఇంకా బెలూన్ సంచరిస్తూనే ఉంది. దీంతో బైడెన్ సర్కార్ కూడా దీన్ని ఏం చేయాలనే దానిపై చర్చలు జరుపుతోంది.
మరోవైపు ఈ బెలూన్ మూడు బస్సుల సైజులో ఉందని తాజాగా అమెరికా గుర్తించింది. ఆకాశంలో అందనంత ఎత్తులో పయనిస్తున్న ఈ బెలూన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియ మల్లగుల్లాలు పడుతున్న అమెరికా.. చైనా స్పందన పేలవంగా ఉండటంపై ఆగ్రహంగా ఉంది. దీంతో చైనాలో పర్యటించాల్సిన బైడెన్ కేబినెట్ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తన పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. చైనా నిఘా బెలూన్ సంచారానికి నిరసనగానే ఈ పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు ఓ ప్రకటన కూడా చేశారు. అమెరికా గగనతలాన్ని చైనా ఉల్లంఘించడంపై అధ్యక్షుడు జో బైడెన్ కు పెంటగాన్ అధికారులు ఇప్పటికే వివరాలు సమర్పించారు. దీంతో ఆయన తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిఘా బెలూన్ ను కూల్చరాదని నిర్ణయించుకున్నారని వైట్ హౌస్ తెలిపింది.
చైనా నిఘా బెలూన్ ప్రస్తుతం యూఎస్ తూర్పు వైపుకు కదులుతున్నట్లు అంచనా వేస్తున్నారు. దీని కింద భారీ స్ధాయిలో పేలోడ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ మాట్లాడుతూ, చైనా ప్రకటనను యూఎస్ గుర్తించిందన్నారు. కానీ తమ గగనతలంలో ఈ బెలూన్ సంచారం తమ సార్వభౌమాధికారంతో పాటు అంతర్జాతీయ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని, ఇది ఆమోదయోగ్యం కాదన్నారు.