అబ్బురపరుస్తోన్న ఐడియా : కొబ్బరి పెంకులతో అద్భుతం
జర్మనీ : ప్రతికూలతలే ప్రత్యామ్నాయ ఆవిష్కరణలకు మార్గం చూపిస్తాయన్న తరహాలో జర్మనీ శాస్త్రవేత్తల పరిశోధనలు కూడా ఆ దిశగానే సాగుతున్నాయి. భూకంపాల నిలయంగా పేరు గాంచిన జర్మనీలో ఏళ్లుగా ఇళ్ల నిర్మాణం ఓ సమస్యగానే ఉంటూ వస్తోంది. కాంక్రీట్ నివాసాల వల్ల భూకంపాల సమయంలో భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండడంతో, దానికి ప్రత్యామ్నాయంగా అంతే స్థాయిలో ధృఢంగా ఉండే మరో నిర్మాణం కోసం అక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు.
ఈ క్రమంలోనే ఓ సరికొత్త ఆవిష్కరణ దిశగా జర్మనీ శాస్త్రవేత్తల ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందుకు వారు స్పూర్తిగా తీసుకున్న అంశమేంటో తెలుసుకుంటే ఖచ్చితంగా షాక్ కావాల్సిందే. 'కొబ్బరి పెంకు', అవును కొబ్బరి పెంకు స్పూర్తితోనే ఇప్పుడు అక్కడి శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు.
సాధారణంగా కొబ్బరి చెట్లు 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. కొబ్బరి బోండాలు కూడా చెట్టు పైభాగంలోనే ఏర్పడుతాయి కాబట్టి అంత ఎత్తు నుంచి కిందపడ్డా.. కాయకు ఎలాంటి పగుళ్లు రాకుండా ఉండడానికి దాని చుట్టు ఓ బలమైన పెంకు నిర్మాణం ఉంటుంది. ఇప్పుడు ఆ పెంకు నిర్మాణానికి సంబంధించిన ఫార్మూలానే స్పూర్తిగా తీసుకుని ఇళ్ల నిర్మాణం చేపడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారు జర్మనీ శాస్త్రవేత్తలు.
కొబ్బరి పెంకులో ఉండే లెథరీ ఎక్సో కార్ప్, ఫైబర్స్ మెసోకార్ప్, ఎండోకార్ప్ అనే మూడు పొరల వల్ల కొబ్బరి పెంకు ధృఢంగా తయారవుతుంది. సరిగ్గా ఇదే పాయింట్ పై ఫోకస్ చేసి తమ పరిశోధనల్లో పురోగతి కోసం ప్రయత్నిస్తున్నారు అక్కడి శాస్త్రవేత్తలు.
ముఖ్యంగా ఎండోకార్ప్ అనే పొరవల్ల పెంకు ఎంత ఒత్తిడికి లోనైనా సరే పగుళ్లు మాత్రం లోపలికి వ్యాప్తి చెందకుండా అందులోని లిగ్నిఫైడ్ స్టోన్ సెల్స్ ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. జర్మనీలోని ఫ్రీబర్గ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు సివిల్ ఇంజనీర్లు, మెటీరియల్ సైంటిస్టులు కలిసి సంయుక్తంగా చేస్తోన్న ఈ పరిశోధనలు పురోగతి దాలిస్తే, భవిష్యత్తులో భూకంపాలు వచ్చినా.. నిశ్చింతంగా ఉండేందుకు అనువుగా ఇళ్ల నిర్మాణం జరిగే అవకాశం ఉంది.