ప్రయాణీకుడిని కాపాడేందుకు రైలునే వంచారు (ఫోటో)
పెర్త్: ఓ ప్రయాణీకుడి కాలు రైలు కింద ఇరుక్కు పోవడంతో.. ఆ రైలును సిబ్బంది, ప్రయాణీకులు ఎత్తిన సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. తోటి ప్రయాణీకుడి కాలు రైలు కింద ఇరుక్కున్నదనే విషయం తెలిసిన అక్కడి సిబ్బంది, ప్రయాణీకులు వెంటనే స్పందించారు.
అంతా కలిసి రైలును ఓ వైపుకు వంచారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి రైలు ఎక్కబోతూ జారిపడ్డాడు. దీంతో అతని కాలు బోగీకి, ప్లాట్ ఫాంకి మధ్యలో ఇరుక్కుపోయింది. రైలును కాస్త అటు పక్కకు వంచితే అతను కాలు లాక్కోవచ్చు. దీంతో సిబ్బంది రైలులోను ప్రయాణీకులను ఓ పక్కకు చేర్చారు. అయినా ఫలితం లేకపోయింది.
దీంతో ప్రయాణీకులు అందరు రైలు దిగి.. బోగీని పక్కకు వంచారు. దీంతో ప్రయాణీకుడు సురక్షితంగా బయట పడ్డాడు. తొలిసారి ఇలాంటి సంఘటన చూశానని, ఐకమత్యం బలం ఏమిటో, ప్రజల శక్తి ఏమిటో చూపించారని ట్రాన్స్పెర్త్ ప్రతినిధి ప్రశంసలు కురిపించారు.