షాకింగ్ థియరీ : కరోనాకు 5జీ టెక్నాలజీతో లింకు? తగలబడిపోతున్న టవర్లు..
కరోనా వైరస్ కంటే దాని చుట్టూ అల్లుకుంటున్న నిరాధారిత కుట్ర కోణాలను,దుష్ప్రచారాలను,తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయడం ప్రపంచ దేశాలకు పెద్ద సవాల్గా మారింది. ఓవైపు వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తుంటే.. మరోవైపు ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టించి సమాజంలో అశాంతికి దారితీసే ఫేక్ న్యూస్ పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి నిరాధారిత కథనాలతో బ్రిటన్లో చాలా నష్టమే జరుగుతోంది. 5జీ టెక్నాలజీ యుగంలో దూసుకుపోతున్న బ్రిటీష్ గడ్డపై కూడా ఇంత అజ్ఞానం రాజ్యమేలుతుందా అనిపించకమానదు అక్కడ చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే.

5జీ టెక్నాలజీని వైరస్కు ముడిపెడుతూ ఫేక్ న్యూస్
ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అయింది. అందులో ఓ అమాయక మహిళ.. ఫోన్ల ద్వారా కూడా కరోనా వస్తోందని చెప్పడం చూసి చాలామంది నవ్వుకున్నారు. కానీ ఇంగ్లాండ్ లాంటి అభివృద్ది చెందిన దేశాల్లోనూ ఇలాంటి ఫేక్ న్యూస్ను ప్రజలు నమ్ముతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎవరు పుట్టించారో.. ఎందుకు పుట్టించారో గానీ.. 5జీ నెట్వర్క్ టవర్స్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఇంగ్లాండ్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో కొంతమంది 5జీ నెట్వర్క్ టవర్స్ను తగలబెట్టడం మొదలుపెట్టారు. బ్రిటన్ వ్యాప్తంగా మొత్తం 30 5జీ నెట్వర్క్ టవర్స్ను తగలబెట్టినట్టు సమాచారం.

ఏముందా ఫేక్ న్యూస్లో
సెల్ఫోన్లలో వినియోగించే 5జీ నెట్వర్క్ కోసం ఏర్పాటు చేసిన వైర్ లెస్ టవర్స్ మనుషుల రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తున్నాయని బ్రిటన్లో కొన్ని ఫేక్ న్యూస్ పుట్టుకొచ్చాయి. రోగ నిరోధక శక్తి తగ్గడంతో వైరస్ సులువుగా శరీరంలో తిష్ట వేయగలుగుతోందని సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్లు విపరీతంగా సర్క్యులేట్ అయ్యాయి. అంతేకాదు,5జీ రేడియో తరంగాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న ఫేక్ మెసేజ్లు కూడా పుట్టుకొచ్చాయి. దీంతో ఇదంతా నిజమేనని నమ్మి కొంతమంది తమ సమీపంలోని 5జీ నెట్వర్క్ టవర్స్ను తగలబెట్టారు.

ఖండిస్తున్న సైంటిస్టులు
ఈ ఫేక్ న్యూస్ను బ్రిటన్ సెల్యూలర్ మెక్రోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా.సిమన్ క్లార్క్ తీవ్రంగా ఖండించారు. 5జీ నెట్వర్క్ రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుందన్న వాదన తప్పని తేల్చి చెప్పారు. సరైన తిండి లేకపోతే,బాగా అలసిపోతే.. లేదా ఇతరత్రా అంశాల వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది తప్పితే.. 5జీకి దానికి సంబంధం లేదన్నారు. బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు జూలియన్ నైట్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ న్యూస్పై కట్టడి అవసరమన్నారు. ఫేస్బుక్,యూట్యూబ్ వీటిపై దృష్టి సారించాలని.. లేదంటే ఈ సంక్షోభ సమయంలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Recommended Video

విపరీతంగా సర్క్యులేట్ అవుతోన్న ఫేక్ న్యూస్
బ్రిటన్లో 5జీ నెట్వర్క్కి కరోనా వైరస్కు ముడిపెడుతూ ఫేక్ సమాచారంతో రూపొందించిన కొన్ని వీడియోలు మార్చి నెలలో యూట్యూబ్లో అప్లోడ్ అయ్యాయి. ఇందులో దాదాపు 10 వీడియోలకు 5.8మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం. ఇదే ఫేక్ న్యూస్ దాదాపు 30 పైగా దేశాల్లో ఇప్పుడు సర్క్యులేషన్లో ఉంది. దీన్నిబట్టి ప్రపంచంలో ఫేక్ న్యూస్ వైరస్ కంటే ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్లో 5జీ టవర్స్ను తగలబెడుతుండటంతో సెక్యూరిటీని మరింత టైట్ చేశారు. ఇప్పటివరకు జరిగిన ఘటనలపై విచారణ జరుపుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications