కరోనా ఎఫెక్ట్: సముద్రంలో 3600 మంది నిర్బంధం.. సాయం కోసం భారతీయుల వేడుకోలు
నీటిపై కదిలే నగరంగా పేరుపొందిన 'డైమండ్ ప్రిన్సెస్' లగ్జరీ నౌకకు గొప్ప చిక్కొచ్చింది. ఇప్పుడా షిప్పును చైనా బయట అతిపెద్ద కరోనా క్లస్టర్ గా గుర్తించారు. వైరస్ కారణంగా షిప్పు లోపలున్న 3600 మందిని భూమ్మీద అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్నారు. జపాన్ లోని యోకోహామా తీరంలో ఈ నెల ఐదు నుంచి డైమండ్ ప్రిన్సెస్ నౌకను అక్కడి ప్రభుత్వం క్వారంటైన్ (తప్పనిసరి నిర్బంధం)లోకి తీసుకుంది. జపనీయుల కోసం వాళ్ల ఆర్మీ రంగంలోకి దిగగా, నౌకలో చిక్కుకుపోయిన 138 మంది భారతీయులు మాత్రం సాయం కోసం ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. కాపాడాంటూ వారు తమ కుటుంబీకులకు పంపిన వీడియోలు హృదయవిదారకంగా ఉన్నాయి.

అసలేం జరిగిందంటే..
డైమండ్ ప్రిన్సెస్ షిప్పులో మొత్తం 3700 మంది ప్రయాణించగా, వారిలో 63 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వైరస్ సోకినవాళ్లలో భారతీయులెవరూ లేరు. ప్రస్తుతం యోకోహామా తీరంలో షిప్పును నిలిపేసిన అధికారులు.. రోగుల్ని మాత్రం ఆస్పత్రులకు తరలించి, మిగతావాళ్లను సముద్రంలోనే నిర్బంధించారు. అందులోని 138 మంది భాయతీయుల్లో 132 మంది షిప్పులో పనిచేసే సిబ్బందేకాగా, ఆరుగురు మాత్రం ప్రయాణికులు. హాంకాంగ్ లో దిగిపోయిన 80 ఏళ్ల ఒక వృద్ధుడి ద్వారా షిప్పులోకి వైరస్ ప్రవేశించినట్లు తెలిసింది. చైనా వెలుపల అతిపెద్ద కరోనా క్లస్టర్ గా ఈ షిప్పును పేర్కొంటుండటం భారతీయుల్ని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది.

కాపాడండి..
‘‘మాకు చాలా భయంగా ఉంది. షిప్పులో వైరస్ వ్యాపించిదని తెలిసిన తర్వాత కూడా మమ్మల్ని ఇక్కడే ఎందుకు నిర్బంధించారో అర్థం కావట్లేదు. సమయానికి భోజనం పెడుతున్నారు.. కానీ ఇంటికి ఎప్పుడు పంపేది చెప్పట్లేదు. మందులు కూడా ఇస్తున్నారు.. కానీ రోగమేంటో చెప్పరు. దయచేసి మన మోదీ సర్కారుకు ఈ విషయాన్ని తెలియజేయండి''అంటూ డైమండ్ ప్రిన్సెస్ షిప్పులో సహాయకుండిగా పనిచేస్తోన్న అభిషేక్(26) ఓ వీడియో పంపాడు. కర్నాటకకు చెందిన అతని తల్లిదండ్రులు ఆ వీడియో చూసి భయంతో విదేశాంగ శాఖను సంప్పదించారు. ముంబైకి చెందిన వినయ్ కుమార్ సర్కార్ అనే మరో వ్యక్తి కూడా తన ఫ్యామిలీకి వేడుకోలు వీడియో పంపాడు.

ఎంబసీ భరోసా..
జపాన్ తీరంలోని క్వారంటైన్ లో ఉంచి షిప్పులోని భారతీయుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని, దీనిపై కంగారుపడాల్సిన అవసరం లేదని జపాన్ లోని భారతీయ ఎంబసీ ప్రకటించింది. భారతీయులతోపాటు షిప్పులో ఉన్న అందరి క్షేమం కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు టోక్యోలోని ఇండియన్ ఎంబసీ అధికారి అనిల్ మీడియాకు తెలిపారు.

ఒకొక్కరినీ మీటర్ దూరంలో నిలబెట్టారు..
షిప్పులోపల భయానక వాతావరణ నెలకొందని, వైద్యపరీక్షలతోపాటు ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటీకీ ఏం జరుగుతుందో అర్థంకావడంలేదని బాధిత భారతీయులు వీడియోల్లో తెలిపారు. ఒకటిరెండ్రోజులకోసారి నౌక డెక్ పైకి తీసుకెళ్లి.. ఒక్కొక్కరినీ మీటర్ దూరంలో ఎండలో నిలబెట్టారని చెప్పారు.

వేరే నౌకలదీ అదే పరిస్థితి..
జపాన్ తీరంలో డైమండ్ ప్రిన్సెస్ నౌకను క్వారంటైన్ చేసినట్లే హాంకాంగ్ తీరంలో ‘వరల్డ్ డ్రీమ్' అనే నౌకను, తైవాన్ తీరంలో వెస్టర్డామ్ అనే మరో నౌకను సముద్రంలోనే నిర్బంధించారు. రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్ కారణంగా చైనాలో మృతుల సంఖ్య 815కు చేరింది. మరో 35వేల మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications