కరోనా వైరస్: మర్కజ్లో మహా విస్ఫోటనం.. ఇండియాలో ఆ జాతులు బతకవు.. షాకింగ్ రిపోర్ట్
ఇండియాలో అతిపెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్గా భావిస్తోన్న ఢిల్లీ నిజాముద్దీన్ 'మర్కజ్'కు సంబంధించిన షాకింగ్ విషయాలు ఒక్కొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. విదేశాలతోపాటు దేశం నలుమూలల నుంచి వేల మంది ముస్లింలు ప్రార్థనల కోసం అక్కడికొచ్చి.. కరోనా కాటుకు గురై.. తెలియకుండానే వైరస్ను వ్యాపింపజేశారు. ఆ వ్యాప్తి ఎంతదాకా వెళ్లిందంటే.. ఏకంగా కొన్ని జాతులకు జాతులే తుడిచిపెట్టుకుపోయేంత!

ఆ తెగవాళ్లు కూడా వచ్చారు..
ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ భవన్ లో మార్చి 13-15 మంధ్య జరిగిన తబ్లీగ్ జమాత్ (ధార్మిక సభ)కు సుమారు 4వేల మంది హాజరై ఉంటారని అధికారులు చెబుతున్నారు. వాళ్లలో ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవాళ్లు కూడా ఉన్నారు. ఢిల్లీ నుంచి సొంత ప్రాంతాలకు తిరిగెళ్లేప్పుడు చాలా మంది వైరస్ ను మోసుకెళ్లారు. అందులో అండమాన్ నికోబార్ దీవులకు చెందిన నికోబారీ తెగకు చెందినవాళ్లు కూడా ఉన్నారు.

మిగతా తెగలకూ ప్రమాదం..
బంగాళాఖాతంలో 572 దీవుల సముదాయమైన అండమాన్ నికోబార్ లో.. పదుల సంఖ్యలో ఆదిమ జాతులు నివసిస్తున్నాయి. అందులో ఒకటిరెండు తప్ప మిగతా జాతులన్నీ అంతరించే దశకు చేరుకున్నాయి. బాహ్య ప్రపంచంతో లేకుండా ఐసోలేషన్ లోనే ఉండటం వారి జీవినవిధానం. ఆ మధ్య అండమాన్ లోని సెంటినలీ తెగ.. తమ దీవిలోకి వచ్చేందుకు యత్నించిన ఓ యువ మతప్రచారకుణ్ని బాణాలతో చంపేసిన సంఘటన సంచలనం రేపింది. సెంటినలీల మాదిరే అండమాన్ లోని జారవా, ఓంగే, గ్రేటర్ అండమానీస్, షొంపెన్ తెగలు కూడా నాగరిక ప్రపంచంతో పెద్దగా కలవరు. ఢిల్లీకి వచ్చిన నికోబారీల వల్ల ఇప్పుడీ నాలుగు జాతులూ ప్రమాదంలో పడ్డట్లయింది.

వాళ్లతోనే సంబంధాలు..
అండమాన్ ప్రాంతంలో ముస్లిం మత వ్యాప్తిలో నికోబారీ జాతి కీలకంగా వ్యవహరిస్తున్నది. ఆ జాతికి చెందిన ఏడుగురు.. ఢిల్లీలోని మర్కజ్ సభలో పాల్గొని వెళ్లారు. ఈనెల 27, 30 తేదీల్లో అండమాన్ స్థానిక అధికారులు పలువురికి కరోనా టెస్టులు చేయగా.. ఏడుగురు నికోబారీలకూ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో డాక్టర్లు, ఆంత్రోపాలజిస్టుల్లో పెనుకలవరం మొదలైంది. ఎందుకంటే.. ఈ నికోబారీ ప్రజలకు.. అంతరించిపోతోన్న జారవా, ఓంగే, గ్రేటర్ అండమానీస్, షొంపెన్ తెగలతో చాలా దగ్గరి సంబంధాలున్నాయి. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆ ఏడుగురు.. మిగతా తెగలవారిని కలిసి ఉండొచ్చని, తద్వారా వైరస్.. ఆదిమ జాతులకు కూడా అంటుకుని ఉండొచ్చని అధికారులు భయపడుతున్నారు.

ప్రమాదం ఎందుకంటే..
కాలక్రమంలో వచ్చిన మార్పులు, వలసదారులు పెరిగినకొద్దీ అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదిమజాతులు ఒక్కొక్కటిగా అంతరించిపోయింది. ఇప్పుడున్న అతి కొద్ది జాతులు కూడా ప్రమాదం అంచున జీవిస్తున్నాయి. కొన్ని శతాబ్దాలుగా ఒంటరిగా జీవిస్తున్నందున వాళ్లలో రోగనిరోధక శక్తి తక్కువ స్థాయిలో ఉంటుందని, బయటి నుంచి బ్యాక్టీరియా లేదా వైరస్ లు వాళ్లకు చాలా హాని కలిగిస్తాయని, కొన్నిసార్లు జలుబు లాంటి చిన్న వైరస్ తోనూ ప్రాణాలకు ముప్పు ఏర్పడేంత సున్నితంగా వాళ్లుంటారని ప్రముఖ ఆంత్రోపాలజిస్టు స్వస్తిక్ హల్దార్ చెప్పారు.

ఓటు హక్కు కల్పించినా..
అండమాన్ లో నివసిస్తోన్న ఆదిమ జాతుల జోలికి వెళ్లొద్దని ఆంత్రోపాలజిస్టులు మొత్తుకుంటున్నా, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మాత్రం వాళ్లతో కాంటాక్ట్ ఏర్పర్చుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఆయా దీవుల్ని టూరిజం కేంద్రాలుగా మార్చే ప్రయత్నం జోరుగా సాగుతోంది. కొన్ని చోట్ల ఆదిమతెగల్ని జంతువుల్లా ప్రదర్శనకు ఉంచారన్న ఆరోపణలు కూడా గతంలో వెల్లువెత్తాయి. గతేడాది లోక్ సభ ఎన్నికల్లో జారవా, ఓంగే, గ్రేటర్ అండమానీస్ తెగకు చెందిన కొందరికి ఓటు హక్కు కూడా కల్పించారు. కొందరు పోలింగ్ కేంద్రం దాకా వచ్చనా ఓటేయకుండానే వెనుదిరిగారు.

ఒక్కరూ మిగలరు..
‘‘దేవుడి దయవల్ల అలా జరగొద్దని కోరుకుంటున్నాను. కానీ ఆ ఆదిమజాతులకుగానీ కరోనా వైరస్ సోకితే వాళ్లలో ఎవరూ ప్రాణాలతో మిగిలే అవకాశం లేదు. ఇప్పటికే చాలా తక్కువ సంఖ్యలో ఉన్న ఆ జాతుల వాళ్లను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాం''అని హల్దార్ అన్నారు. కొవిడ్-19 పేషెంట్లుగా తేలిన ఏడుగురు నికోబారీలు.. ఢిల్లీ నుంచి వచ్చాక ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరెవర్ని కలిసింది ట్రేస్ చేస్తున్నామని అండమాన్ నికోబార్ అడ్మనిస్ట్రేషన్ సీనియర్ అధికారి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications