కరోనా విలయం: చైనాలో సంచలనం.. వైరస్ బాధితుల న్యాయపోరాటం.. ఒక్కొక్కర్నీ లేపేస్తోన్న ప్రభుత్వం..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 రోగుల సంఖ్య 37లక్షలకు, మరణాలు 2.6లక్షలకు పెరిగాయి. ప్రపంచంలోని ప్రతి దేశంలో లెక్కలు రోజురోజుకూ మారుతూనే ఉంటాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఇవాళ్టికి కేసులు 12లక్షలు, మరణాలు 70వేల దాటాయి. ఇండియాలోనూ కేసులు 46వేలు, దాటగా, మరణాలు1600కు చేరువయ్యాయి. కానీ చైనాలో మాత్రం కొద్ది రోజులుగా కేసులు, మరణాల సంఖ్యలో పెద్దగా మార్పులేదు. మరణాలు లేకపోవడం మంచిదే, కానీ రెండు నెలలుగా కేసుల సంఖ్య స్టాండర్ట్ గా 83వేల దగ్గరే ఉంది..

సొంత ప్రజలే నమ్మట్లేదు..
కొవిడ్-19 కేసుల విషయంలో చైనా ప్రకటిస్తోన్న లెక్కలపై లెక్కకుమించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క లెక్కలేకాదు, అసలు వైరస్ పుట్టుక, వ్యాప్తి చెందిన తీరును చైనా దాచడంవల్లే ఇవాళ ప్రపంచం ముప్పులో కూరుకుపోయిందని విమ్శలు వ్యక్తమయ్యాయి. వూహాన్ సిటీలోని ల్యాబ్ లోనే వైరస్ ను తయారుచేశారని, ఇందుకు చైనాపై ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా హెచ్చరించగా, జర్మనీ, స్పెయిన్ లాంటి మరికొన్ని బాధిత దేశాలు ఇప్పటికే చైనాకు కరోనా నష్టపరిహారం నోటీసులు పంపాయి. అంతర్జాతీయ గొడవలకుతోడు అసలు చైనాలో దేశీయంగా ఏం జరుగుతోందో తాజా రిపోర్టుల్లో వెల్లడైంది. సొంత ప్రజలే జిన్ పిన్ సర్కారు చెబుతోన్న విషయాల్ని నమ్మడంలేదని తేలింది.

సర్కారుపై దావాలు..
కరోనా వైరస్ గబ్బిలాల ద్వారా పుట్టిందని, వూహాన్ లోని మార్కెట్ ద్వారా అది వ్యాపించిందని చైనా ప్రభుత్వం చెబుతోంది. అయితే మొదట వైరస్ ను గుర్తించిన సమయం, అది విస్తరించకుండా ఎలాంటి చర్యలు చేపట్టారనే విషయంలో ప్రభుత్వం చెబుతున్నదంతా అబద్ధమని వూహాన్ సిటీ వాసులు అంటున్నారు. ప్రభుత్వం నిజాలు చెప్పకుండా దాచిపెట్టినందుకే తమ కుటుంబీకులను కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో కొందరు కూడబలుక్కుని ప్రభుత్వంపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం హక్కుల కార్యకర్త యాంగ్ జాంకింగ్ ను సంప్రదించారు. ఈ జాంకింగ్ పై ఇంతకుముందే చైనా ప్రభుత్వం నిషేధం విధించడంతో అతను అమెరికాలో ఆశ్రయం పొందుతున్నాడు.

పగబట్టిన పోలీసులు..
కమ్యూనిస్ట్ ప్రభుత్వంపై న్యాయపోరాటం చేసే విషయమై రెండు నెలలుగా తనతో సంప్రదింపులు జరిపిన బాధితులు.. సడెన్ గా మాట్లాడటం మానేశారని, ఆరా తీస్తే, పోలీసులు వాళ్లను బెదిరించారని వెల్లడైనట్లు జాంకింగ్ మీడియాకు చెప్పారు. కరోనా విషయంలో వాస్తవ రిపోర్టులు రూపొందించిన స్వచ్ఛంద కార్యకర్తలు సైతం కనిపించకుండా పోయారని, వాళ్లను ప్రభుత్వమే హత్యచేయించి ఉండొచ్చని, ఇప్పుడు న్యాయపోరాటం చేస్తున్నవాళ్లకు కూడా అదే గతి పడుతుందనే భయంతో వెనుకడుగు వేశారని ఆయన తెలిపారు.

చైనా కోర్టుల్లో సాధ్యమేనా?
ఏక పార్టీ పాలనలోని చైనాలో న్యాయవ్యవస్థ పేరుకు మాత్రం ఇండిపెండెంట్ అయినప్పటకీ, కమ్యూనిస్టు లీడర్ల కనుసన్నల్లోనే తీర్పులు వెలువడతాయని అంటుంటారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితుల న్యాయపోరాటం ఎంతవరకు ఫలిస్తుందనేది అనుమానమే. కరోనా వైరస్ ఎపిసెంటరైన హుబే ఫ్రావిన్స్ కే చెందిన తాన్ జున్ అనే ప్రభుత్వ ఉద్యోగి.. కరోనా విషయంలో నిజాలు వెల్లడించాలంటూ గత నెలలో ప్రభుత్వంపై దావా వేశాడు. ఇప్పటిదాకా పబ్లిక్ గా ఆ పని చేసిన మొదటి వ్యక్తి ఆయనే. తాన్ జాన్ స్ఫూర్తితో ఇంకొందరు బాధితులు కూడా కోర్టు మెట్లెక్కేందుకు ప్రయత్నించినా, ప్రభుత్వం బెదిరింపులతో లొంగదీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.

ఆ పని చేస్తే చిక్కులు తప్పవనే..
నిజానికి విపత్తులు, భారీ ప్రమాదాల సమయంలో బాధితుల పట్ల చైనా ప్రభుత్వం అంతోఇంతో ఉదారంగానే వ్యవహరిస్తుంది. 2008లో జిషువాన్ ఫ్రావిన్స్ లో భూకంపం సంభవించి 69వేల మంది చనిపోగా, బాధితుల కుటుంబాలకు భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. 2011నాటి వెంజో సిటీ రైలు ప్రమాద ఘటనలోనూ మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంది. అయితే తనకు నచ్చని విషయాల్లో మాత్రం కమ్యూనిస్టు పార్టీ కర్కషంగా వ్యవహరిస్తుంది. 1989నాటి డెమోక్రసీ మూమెంట్ లో చనిపోయినవాళ్ల కుటుంబాలు ఇప్పటికీ వేధింపులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ బాదితుల న్యాయపోరాటానికి అనుమతిస్తే, ప్రపంచం ముందు తాను చేస్తోన్న వాదన పలుచబడుతుందనే భయంతోనే చైనా ప్రభుత్వం బాధితులపై బెదింరింపులకు దుగుతోందని యాంగ్ జాంకింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications