చైనాలో తిరగబెడుతున్న కరోనా.. వూహాన్లో పువాయ్ పువాయ్.. వైరస్ పుట్టిన మార్కెట్ రీ ఓపెన్..
రెండు నెలల లాక్ డౌన్ తర్వాత చైనాలోని ప్రఖ్యాత వూహాన్ సిటీలో బస్సులు, కార్ల 'పువాయ్.. పువాయ్..' చప్పుళ్లు వనిపించాయి. బుధవారం నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం బస్సు సర్వీసుల్ని ప్రారంభించింది. జాగ్రత్త చర్యల్లో భాగంగా బస్సుకు ఒకరు చొప్పున హెల్త్ సూపర్ వైజర్ ను నియమించారు. ప్రయాణికులెవరైనా అనారోగ్యానికి గురైతే సాయం అందించేందుకే ఈ ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. టికెట్ తోపాటు వెల్ నెస్ వివరాల్ని కూడా మొబైల్స్ లో చూపాల్సి ఉంటుందని, ఫోన్లు లేనివాళ్లు డాక్టర్ సర్టిఫికేట్ వెంట ఉంచుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు.
Recommended Video
విమానాలు కూడా..
హుబే ఫ్రావిన్స్, దాని రాజధాని వూహాన్ సిటీలో బుధవారం నుంచి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ప్రారంభం కాగా.. వచ్చే నెల 8 నుంచి పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేయబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఆ రోజు నుంచి జనం క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ తోపాటు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఆ మార్కెట్ కూడా?
ప్రపంచ వ్యాప్తంగా 20 వేల మందిని పొట్టనపెట్టుకున్నా, ఇంకా నెత్తుటిదాహం తీరని కరోనా వైరస్.. వూహాన్ లోని మాంసం మార్కెట్ లో పుట్టిందన్న సంగతి తెలిసిందే. పాములు, గబ్బిలాల ద్వారా వైరస్ మనుషులకు సోకిందన్న సైంటిస్టులు.. ఆ పక్రియ ఎలా జరిగిందనేదానిపై లోతైన అధ్యయనం చేస్తున్నారు. ఇలాఉంటే, వచ్చే నెల 8న పూర్తి లాక్ డౌన్ ఎత్తివేతతో మళ్లీ ఆ మర్కెట్ రీ ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయి. వూహాన్ సిటీలో సుమారు 25 వేల మంది వైద్య సిబ్బంది నిరంతరం పనిచేస్తున్న నేపథ్యంలో మళ్లీ అక్కడ వైరస్ ప్రభావం చూపే చాన్సేలేదని అంటున్నారు. కానీ అంతలోనే..
తిరుగబెట్టిందా?
గత మూడు వారాలుగా చైనాలో కరోనా ప్రభావం తగ్గుతూ రావడం, గత బుధవారం నుంచి మరణాల సంఖ్య కూడా దాదాపు పడిపోవడంతో ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. రెండు నెలల లాక్ డౌన్ తర్వాత ఇటు వూహాన్ లో బస్సు సౌకర్యాన్ని పున: ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందే దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు కూడా తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, ఇన్నాళ్లూ ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన చైనీయులు స్వదేశానికి వెళుతూ మళ్లీ వైరస్ ను మోసుకెళుతున్నట్లు వెల్లడైంది.
కొత్త కేసులు..
చైనాలో బుధవారం నాటికి 474 కొత్త కేసులు నమోదయ్యాయని, అయితే అందులో ఏ ఒక్కటి కూడా లోకల్ ట్రాన్స్ మిషన్ వల్ల రాలేదని, అందరికి అందరూ బయటి దేశాల నుంచి వచ్చినవాళ్లేనని నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. అంతర్జాతీయ సర్వీసులు మొదలు కావడంతో వివిధ దేశాల్లో ఇరుక్కుపోయినవాళ్లంతా సొంతగడ్డకు వస్తుండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, వాళ్లందరికీ అవసరరాన్ని బట్టి ఐసోలేషన్ లేదంటే క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఎన్హెచ్ఎస్ పేర్కొంది.
ప్రపంచం విలవిల
చైనాలో కరోనా వల్ల 3,281 మంది చనిపోగా, ఇప్పటికీ 81,218 పాజిటివ్ కేసులున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 4.5 లక్షలకు మరణాలు 20వేలకు చేరువయ్యాయి. ఇటలీలో అత్యధికంగా 6,820 మంది చనిపోయారు. చైనా తర్వాత జనాభాలో రెండో అతిపెద్ద దేశం భారత్ పైనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. బుధవారం నాటికి కేసుల సంఖ్య 600 దాటగా, 10 మంది చనిపోయారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది.