నేపాల్: 7,757కు చేరిన మృతుల సంఖ్య, నష్టం వివరాలివే..!
ఖాఠ్మండు: నేపాల్ భూకంప నష్ట వివరాలను అ దేశ హోం మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. గత నెలలో ఏప్రిల్ 25న రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో వచ్చిన భూకంపానికి అక్కడ 2,79,234 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
అదే విధంగా 2,37,068 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భూకంప తాకిడికి 7,757 మంది మృతి చెందగా, 16,390 మంది క్షతగాత్రులుగా మారారని పేర్కొన్నారు. బుధవారం నాటికి 12 దేశాలకు చెందిన 600 సహాయక బృందాలు నేపాల్ వదిలి స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయాయన్నారు.

ఇది ఇలా ఉంటే, భూకంప తాకిడికి పూర్తిగా నేలమట్టమైన నేపాల్ రాజధానికి సమీపంలో ఉన్న గ్రామాలకు ఇంకా సహాయక చర్యలు అందడం లేదని బాధితులు వారి ఆవేదనను వెలిబుచ్చారు. ప్రస్తుతానికి నేపాల్లో సహాయక చర్యల్లో పోలీసులు, ఆర్మీ పాలు పంచుకుంటోంది.
భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న సింధుపాల్చౌక్ జిల్లాలో అత్యధికంగా మూడువేల మంది, రాజధాని ఖాట్మండులో 1300 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. భూకంపానికి దెబ్బతిన్న ఇళ్లతోపాటు మిగిలిన ఇళ్ల పటిష్ఠత ను పరీక్షించేందుకు 2 వేల మంది ఇంజనీర్లు రంగంలోకి దిగారు.
కూలిపోకుండా మిగిలిన ఇళ్లలో 50శాతం నివాసయోగ్యంగా ఉన్నాయని, 20-25శాతం ఇళ్లను కూల్చేయాలని నిర్ధారించారు. ఇక.. సహాయక చర్యలు జరుగుతున్న ప్రాంతాల్లో డ్రోన్లను పూర్తిగా నిషేధిస్తున్నట్లు అక్కడి అధికారులు స్పష్టం చేశారు. సున్నితమైన సమాచారం బయటిప్రాంతాలకు చేరకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications