డెల్టా వేరియంట్: ఆస్ట్రేలియాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్-19 కేసులు

ఆస్ట్రేలియాలో కరోనావైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
శరవేగంగా వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్ రకం కోవిడ్ కేసుల సంఖ్య సిడ్నీ నగరంలో 128కి పెరిగింది.
ఆస్ట్రేలియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కేసులు బయటపడుతున్నాయి.
ఉత్తరాన ఉన్న క్వీన్స్ల్యాండ్, పశ్చిమ ఆస్ట్రేలియాలలో కూడా డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒకేసారి కరోనా కేసులు నమోదు కావడం కొన్ని నెలల తర్వాత ఇదే తొలిసారి.
కేసులు పెరుగుతుండటంతో దీనిపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల నాయకులతో ఆస్ట్రేలియా ప్రధాని అత్యవసరంగా సమావేశం నిర్వహించబోతున్నారు.
కరోనాపై పోరాటంలో ఆస్ట్రేలియా క్లిష్టమైన సమయాన్ని ఎదుర్కొంటోందని ట్రెజరర్ జోష్ ఫ్రైడెన్ బర్గ్ చెప్పారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు కొత్త ఆంక్షలు విధించాయని వెల్లడించారు.
'వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా రకం వేరియంట్తో, మనం మహమ్మారి కొత్త దశలోకి అడుగుపెడుతున్నాం' అని ఏబీసీ న్యూస్తో ఆయన చెప్పారు.
- ఎమర్జెన్సీ: 'అక్రమ నిర్బంధానికి బలైన’ స్నేహలతారెడ్డి జైలు డైరీ
- అలెగ్జాండర్: 20 ఏళ్ల వయసులో సింహాసనం ఎక్కడం నుంచి అంతుచిక్కని మరణం వరకు..

సిడ్నీలో పరిస్థితి ఆందోళనకరం
కరోనా కేసులు పెరుగుతుండటంతో సిడ్నీ, డార్విన్ నగరాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. మరో నాలుగు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు.
సిడ్నీలో లాక్డౌన్తో దాదాపు 50లక్షల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది.
న్యూసౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం గ్రేటర్ సిడ్నీ, బ్లూ మౌంటేన్స్, సెంట్రల్ కోస్ట్లో లాక్డౌన్ విధించింది. దాంతో చాలా రకాల వ్యాపారాలు మూతపడ్డాయి.
సోమవారం కొత్తగా 18 కేసులు నమోదయ్యాయని న్యూ సౌత్ వేల్స్ ప్రధానమంత్రి గ్లాడిస్ బెరెజిక్లియన్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో 59వేల మందికి టెస్టులు చేసినట్లు వెల్లడించారు. డెల్టా రకం కోవిడ్ బారినపడిన రోగి ఉన్న ఇళ్లలో అందరికీ ఈ వైరస్ సోకుతున్నట్లు గమనించామన్నారు.
దీంతో వైరస్ ఉధృతి పెరిగే అవకాశం ఉందని, దీనికి అడ్డుకట్ట వేయడానికి అందరూ సిద్ధంగా ఉండాలని గ్లాడిస్ బెరెజిక్లియన్ పిలుపునిచ్చారు.
సిడ్నీ, క్వీన్స్ల్యాండ్, ఉత్తర ఆస్ట్రేలియాల్లో బయటపడిన డెల్టా రకం కరోనావైరస్ కేసులు, హోటల్ క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారి నుంచి సోకినట్లు భావిస్తున్నారు.
కొత్త కేసులతో అంతర్ రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులను మూసివేశారు.
ఆస్ట్రేలియా నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ లేకుండా దేశంలోకి వచ్చే అవకాశాన్ని న్యూజీలాండ్ తాత్కాలికంగా నిలిపేసింది.
ఆస్ట్రేలియాలో కరోనావైరస్ వ్యాప్తి రేటు మొదటి నుంచి తక్కువగానే ఉంది. సరిహద్దుల మూసివేత, కఠిన క్వారంటైన్ నిబంధనలు, వేగంగా టెస్టులు చేయించడం, కాంటాక్టు ట్రేసింగ్ వంటివి ఆ దేశాన్ని వైరస్ బారినుంచి కాపాడాయి.
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో కరోనాతో ఒక్కరు కూడా మరణించలేదు. మొత్తంగా ఇప్పటి వరకు 30,450 కేసులు నమోదు కాగా, 910 మంది ప్రాణాలు కోల్పోయారు.
డెల్టా వేరియంట్ రకం కరోనావైరస్ శక్తిమంతమైన శత్రువని న్యూ సౌత్ వేల్స్ ఆరోగ్య మంత్రి బ్రాడ్ హజ్జార్డ్ పేర్కొన్నారు.
'మేము ఎన్ని రకాల రక్షణాత్మక చర్యలు తీసుకున్నా.. ఎదురు దాడి చేయడానికి వైరస్ ప్రయత్నిస్తోంది' అని చెప్పారు.
రెండు వారాల క్రితం సిడ్నీలోని బోండి ప్రాంతంలో డెల్టా రకం వైరస్ కేసు వెలుగుచూసింది. వ్యాక్సీన్ వేయించుకోని ఓ డ్రైవర్ ద్వారా ఇది దేశంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అతను అంతర్జాతీయ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాడు.
- కోవిడ్-19 వ్యాక్సీన్: టీకా వేసుకుంటే నపుంసకత్వం వస్తుందా?
- మహిళల్లో సున్తీ: 'నాకు చేశారు.. నా కూతుళ్లకు చేయనివ్వను’

వ్యాక్సినేషన్
కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగడంపై విమర్శలు మొదలయ్యాయి.
ఆస్ట్రేలియా యువతలో కేవలం 5 శాతం మందికి మాత్రమే ఇప్పటిదాకా వ్యాక్సీన్ అందింది. 30శాతం మందికి తొలి డోసు వేశారు.
ఆస్ట్రాజెనెకా టీకాతో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉందనే రిపోర్టులు వచ్చాయి. దాంతో చాలామంది ఆ వ్యాక్సీన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.
ఫైజర్ వ్యాక్సీన్ కొన్ని వయసుల వారికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు.
జనాభాలో ఎక్కువ మందికి వ్యాక్సీన్లు ఇస్తే, నగరాల్లో లాక్డౌన్ విధించాల్సిన అవసరం ఉండదంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- భారత సైన్యంలో నేపాలీ మహిళల నియామకంపై వివాదం ఏమిటి?
- లక్షద్వీప్: సినీనటి ఆయేషా సుల్తానాపై దేశద్రోహం కేసు ఎందుకు పెట్టారు?
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్కు ప్రపంచం భయపడాల్సిందేనా?
- అధికారులను జైలుకి పంపినంత మాత్రాన ఆక్సిజన్ కొరతకు పరిష్కారం దొరకదు: జస్టిస్ చంద్రచూడ్
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులు శత్రువులు, రాజద్రోహులా? :అభిప్రాయం
- భారత ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉంది ఎందుకు?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మావోయిస్టు హరిభూషణ్ మృతి-కరోనా లేదా గుండెపోటుతో మరణించి ఉండొచ్చన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ
- ఇస్రో గూఢచర్యం కేసు: కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తునకు సుప్రీం ఆదేశం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- UAPA చట్టం కింద నమోదైన 97.8 శాతం కేసుల్లో ఆరోపణలు నిరూపితం కాలేదు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications