భారత్ వెనక్కి తగ్గబోతోంది.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన..!
భారత్-అమెరికా మధ్య దశాబ్దాలుగా ఎన్నో అంశాల్లో సహకారం కొనసాగుతోంది. అయితే తాజాగా రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దూకుడు నిర్ణయాల నేపథ్యంలో ఇరు దేశాల బంధంపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా వలసలు, సుంకాల పెంపు వంటి చర్యలతో భారత్ కు ట్రంప్ చికాకు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎదురవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో అనూహ్యంగా ట్రంప్ తన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను కుటుంబంతో సహా భారత్ కు పంపారు. తద్వారా భారత్ నుంచి తమకేం కావాలో చెప్పేశారు.
ఈ నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య సుంకాల విషయంలో నెలకున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే చర్యలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమెరికా వస్తువుల దిగుమతుల విషయంలో సుంకాల్ని మరింతగా తగ్గించుకునేందుకు ప్రధాని మోడీ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్యయంగా ప్రకటించారు. భారత్ తన సుంకాల్ని మరింత తగ్గించుకునేందుకు అంగీకరించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు తనకు సమాచారం అందిందన్నారు.

భారతదేశం సుంకాలను తగ్గిస్తుందని తనకు అర్థమైందని ట్రంప్ తన ఓవల్ కార్యాలయంలో మీడియాకు తెలిపారు. అయితే, నిర్దిష్ట ఉత్పత్తులు, సమయం లేదా నిర్ధారణకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉందన్నారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల నేపథ్యంలో ఇది జరిగిందని ట్రంప్ తెలిపారు. అమెరికాకు విదేశాల్లో ఉన్న 15 వాణిజ్య ఒప్పంద భాగస్వాముల్లో భారత్, చైనా కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి, చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి వాషింగ్టన్లో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా అధికారులు అధికారిక చర్చలను ప్రారంభించనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో సుంకాల విషయంలో పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం చెప్పిన వివరాల ప్రకారం ఈ ఒప్పందం రెండు దేశాల ఉద్యోగులు, రైతులు, వ్యాపారవేత్తలు, మహిళలకు అవకాశాలను కల్పిస్తుంది. అలాగే విదేశీ మార్కెట్లలో అమెరికా ఉత్పత్తులను మరింతగా పొందేందుకు వీలు కల్పిస్తుంది. దీని వల్ల అమెరికా వాణిజ్య లోటు కూడా భారీగా తగ్గే అవకాశమున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications