పారిశ్రామికవేత్తల సలహా మండళ్లపై ట్రంప్ వేటు: సివోల మండిపాటు
అవును నేనింతే: పారిశ్రామికవేత్తల సలహా మండలపై ట్రంప్ వేటు.. జాత్యాంహకారానికి చోటు లేదన్న సీఈవోలు.. సైన్యం మండిపాటు
వాషింగ్టన్/న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తానింతేనని, ఎవరేం చెప్పినా వినబోనని మరోసారి స్పష్టం చేశారు. సలహాలు, సంప్రదింపుల కోసం పారిశ్రామికవేత్తలతో ఏర్పాటుచేసిన రెండు సలహా మండళ్లను గురువారం రద్దుచేసేశారు. శ్వేతజాతి దురహంకారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేస్తున్న పరోక్ష మద్దతుపై ఆ దేశంలో నిరసన రోజురోజుకీ పెరుగుతున్నది.
తాజాగా ఈ జాబితాలో ప్రముఖ సాఫ్ట్వేర్, సోషల్ నెట్వర్కింగ్ సంస్థలు మైక్రోసాఫ్ట్, యాపిల్, ఫేస్బుక్ల సీఈఓలు జత కలిశారు. ట్రంప్ వైఖరిని అమెరికా మాజీ అధ్యక్షులు తండ్రీ కొడుకులు జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్, జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా ఒక ప్రకటనలో ఖండించారు. జాతిపరమైన అంధవిశ్వాసాలను, వివక్షను, విద్వేషాన్ని అమెరికా ఎల్లప్పుడూ తిరస్కరిస్తూ ఉండాలి అని పిలుపునిచ్చారు.
గతవారం వర్జీనియాలోని చార్లాట్స్విల్ల్లేలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వారిపైకి కారు దూసుకురావటంతో ఘటనలో ఒక మహిళ మరణించింది. ఈ దాడులకు ట్రంప్ మద్దతు తెలిపారన్న అసంతృప్తితో సభ్యులుగా ఉన్న పలువురు కార్పొరేట్ సంస్థల సీఈవోలు విమర్శలు గుప్పించారు. ఆయన నియమించిన సలహా మండళ్లకు రాజీనామా చేశారు.
దీంతో ఆ రెండు సలహా మండళ్లను రద్దు చేస్తున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే డిసెంబర్లో ట్రంప్ 16 మంది సభ్యులతో వ్యూహాత్మక, విధానాల మండలి (స్ట్రేటజిక్ అండ్ పాలసీ ఫోరం) ఏర్పాటుచేశారు. అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత జనవరిలో వైట్హౌస్ మాన్యుఫాక్చరింగ్ జాబ్ ఇనిషియేటివ్ పేరుతో తయారీరంగం, ఉద్యోగకల్పనపై మరో సలహామండలిని ఏర్పాటు చేశారు. ట్రంప్ తీరును వ్యతిరేకిస్తూ ఈ మండళ్ల నుంచి ఇంద్రానూయి (పెప్సీ), మేరీ బారా (జనరల్ మోటార్స్) తదితర ప్రముఖ వ్యాపారసంస్థల అధిపతులు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.
బహుళత్వాన్ని మైక్రోసాఫ్ట్ గౌరవిస్తుందని వ్యాఖ్య
వర్జీనియాలోని ఛార్లెస్ట్విల్లీలో ఇటీల జరిగిన హింస, దాడుల్లో 32 ఏళ్ల మహిళ మరణించడాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఖండించారు. ఇది భయానక ఘటన అని అభివర్ణించారు. వైవిధ్యతను, బహుళత్వాన్ని మైక్రోసాఫ్ట్ గౌరవిస్తుందని అంటూ మనచుట్టూ జరుగుతున్న బాధలపై సానుభూతి చూపాలని ఉద్యోగులను కోరారు. ఈ మేరకు ఉద్యోగులకు సందేశం పంపించారు. ‘‘మన సమాజంలో పక్షపాతం, స్వపక్షదురభిమానం, వర్జీనియాలో శ్వేతజాతీయులు రెచ్చగొట్టిన విచక్షణారహిత హింసకు చోటు, అంధ విశ్వాసాలకు, పక్షపాతానికి స్థానం లేదు. ప్రజలతో సత్సంబంధాలను కొనసాగించాల్సిన ముఖ్యమైన సందర్భం ఇదే. ఒకరి అనుభవాలను మరొకరు విని తెలుసుకోవాల్సిన సమయమూ ఇదే. మనం నివసిస్తున్న, పనిచేస్తున్న, సేవలు అందిస్తున్న సమాజాల్లో మార్పు కోసం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు కలిసికట్టుగా కృషి చేస్తారు. మనమంతా ఉమ్మడి మానవత్వాన్ని స్వీకరించి, గౌరవం, సానుభూతి, అందరికీ అవకాశాలు ఉన్న సమున్నత సమాజం సృష్టించడానికి ఆకాంక్షించాలి' అని కోరారు.
సురక్షిత వేదికగా ఫేస్ బుక్
శ్వేత జాతీయులకు మద్దతుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఫేస్బుక్ సహవ్యవస్థాపకుడు జుకర్బర్గ్ ఖండించారు. ‘‘మన సమాజంలో విద్వేషానికి తావు లేదు. నేరాలు, హింసను ప్రోత్సహించే ఛార్లెట్స్విల్లేలో జరిగిన దానితో సహా ఎలాంటి సమాచారాన్నైనా తక్కువ చేసి చూపుతున్నాం. మరిన్ని ప్రదర్శనలు, భౌతిక దాడులు జరిగే అవకాశం ఉన్నందున పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాం. మనం అన్ని సార్లూ సక్రమంగా ఉండకపోవచ్చు. కానీ ఫేస్బుక్లో అందరూ సురక్షితంగా ఉన్నారన్న భావన కలిగించేందుకు కృషి చేస్తున్నామన్న నా మాటను మీరు విశ్వసించవచ్చు. మన (ఫేస్ బుక్) వేదికలో విదేశ్వానికి స్థానం లేదు. ద్వేషపూరిత నేరాలు, ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించే పోస్టులకు ఫేస్ బుక్ లో స్థానం కల్పించడం లేదు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా భావించే వేదికగా ఫేస్బుక్ను నిలుపటానికి జరుగుతున్న కృషిని కొనసాగిస్తాం'' అని అన్నారు.
విద్వేషం కేన్సర్లాంటిదన్న టిమ్ కుక్
ఈ ఉదంతాలపై ఆపిల్ సీఈవో టిమ్ కుక్ తన ఉద్యోగులకు సందేశం పంపిస్తూ విద్వేషం కేన్సర్లాంటిదని వ్యాఖ్యానించారు. దురహంకారులను, వారిని వ్యతిరేకిస్తూ మానవ హక్కుల కోసం పోరాడేవారిని ఒకే గాటన కట్టాలన్న అధ్యక్షుడి అభిప్రాయంతో నేను విభేదిస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. ‘‘మన దేశంలో అలాంటి విద్వేషాలు, జాత్యహంకారానికి అనుమతించకూడదు. మనం సాక్షులుగా కూడా ఉండకూడదు. ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉండాలి. ఈ వ్యవహారం వామపక్షమా, ఉదారవాదమా, సంప్రదాయవాదమా అన్న సమస్యకు సంబంధించినది కాదు. ఇది మానవ గౌరవం, నైతికతలకు సంబంధించినది. శ్వేత జాత్యహంకార వాదులు, నాజీలు ఒక్కలాంటివారేనని; వారిని వ్యతిరేకించేవారు మానవహక్కుల తరఫున నిలడడేవారన్న వాదనలను నేను అంగీకరించను. వీరిని అలా పోల్చడం అమెరికా సిద్ధాంతాలకు వ్యతిరేకం'' అని వ్యాఖ్యానించారు.
అమెరికాలో సైనికాధికారుల అసహనం బహిర్గతం అరుదు
అమెరికాలో పెరుగుతున్న శ్వేతజాతి దురంహకారాన్ని అమెరికా సైన్యానికి చెందిన ఐదుగురు అత్యంత సీనియర్ అధికారులు ఖండించారు. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్కు చెందిన జనరల్ రాబర్ట్ నెల్లర్ (కమాండెంట్ ఆఫ్ అమెరికా మెరైన్కార్ప్స్), అడ్మిరల్ జాన్ రిచర్డ్సన్ (చీఫ్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్), జనరల్ మార్క్ మిల్లే (చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ ఆఫ్ ది ఆర్మీ), జనరల్ డేవ్ గోల్డ్ఫీన్ (ఎయిర్ఫోర్స్), జోసెఫ్ లెంగ్యెల్ (నేషనల్ డార్డ్ బ్యూరో అధిపతి) శ్వేతజాతీయుల చర్యలను వ్యతిరేకిస్తూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. దేశంలో జాతివివక్ష, తీవ్రవాదం వంటివి పెరుగటం 1775 నుంచీ అమెరికా పాటిస్తున్న విలువలకు వ్యతిరేకమని, దీనిని అమెరికా సైన్యం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదని పేర్కొన్నారు. ఈ విధంగా సైన్యానికి చెందిన అత్యంత సీనియర్ అధికారులు అధ్యక్షుడి వైఖరిపై స్పష్టంగా వ్యతిరేకతను ప్రదర్శించటం అమెరికా చరిత్రలోనే అరుదైన విషయం.