8 రోజుల్లో హిల్లరీ 6,50,000 ఈ-మెయిల్స్ చదివేశారా: ట్రంప్ ప్రశ్న
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్... డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్ వివరణ పైన అనుమానం వ్యక్తం చేశారు. కేవలం ఎనిమిది రోజుల్లోనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) 6,50,000 మెయిల్స్ చదివిందా అని ప్రశ్నించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మంగళవారం నాడు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్, హిల్లరీల్లో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న హిల్లరీ, ట్రంప్లు ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నారు.
హిల్లరీ గెలిస్తే.. రికార్డులే: 'బిల్ క్లింటన్' అందరిలో ఓ ప్రశ్న
ఈ క్రమంలో, ఎఫ్బీఐ డైరెక్టర్ పైన డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్కు చెందిన 6,50,000 ఈమెయిల్స్ను కేవలం ఎనిమిది రోజుల్లోనే చదివేశారా? అని ప్రశ్నించారు. హిల్లరీ అక్రమాలపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరముందన్నారు. ఎన్నో దారుణాలకు పాల్పడ్డ ఆమెను ఎఫ్బీఐ వదిలిపెట్టరాదన్నారు. నేరాలకు పాల్పడ్డ హిల్లరీని అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టరాదని అమెరికన్లకు ఆయన పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా, ఇందుకు సంబంధించి ఓ ట్వీట్లో జెనరల్ ఫ్లిన్ ఓ ట్విట్ చేశారు. ఎనిమిది రోజులు అంటే 6,91,200 సెకండ్లు ఉన్నాయని, ఎఫ్బీఐ డైరెక్టర్ 6,50,000 మెయిల్స్ చదివేందుకు ఒక్కో సెకండ్ కంటే తక్కువ తీసుకున్నారా అని ప్రశ్నించారు.
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్కు రెండు రోజుల ముందు హిల్లరీ క్లింటన్కు భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. ప్రయివేటు ఈ-మెయిల్స్ వ్యవహారానికి సంబంధించి హిల్లరీపై ఎలాంటి క్రిమినల్ విచారణ చేపట్టమని ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమే ప్రకటించారు. ఈ-మెయిల్స్ వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న హిల్లరీకి నిజంగా ఇది ఊరటే.