ఆ విషయంలో మోదీ నా కంటే ఘనుడు: పోటీ కూడా పడలేను
Modi Trump meeting: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. అధ్యక్షుడి అధికారిక నివాసం రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్హౌస్లో ఈ సమావేశం ఏర్పాటైంది. 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే ఇద్దరు నేతల మధ్య ఈ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
భేటీ అనంతరం మోదీ- ట్రంప్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం సహా వివిధ అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇద్దరు నేతలు సమాధానాలను ఇచ్చారు. భారత్ సభ్యదేశంగా ఉన్న బ్రిక్స్పై అమెరికా 100 శాతం టారిఫ్ విధించదలిచిన నేపథ్యంలో- ఎక్కువగా ట్రేడ్- టారిఫ్పైనే ప్రశ్నోత్తరాలు సాగాయి.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయా దేశాలతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మోదీ, ట్రంప్ స్పష్టం చేశారు. అటు రష్యా, ఇటు ఉక్రెయిన్తో తమకు సుదీర్ఘకాలంగా సత్సంబంధాలు ఉంటోన్నాయని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ఈ రెండు దేశాల అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, వొలొదిమిర్ జెలెన్స్కీని వేర్వేరుగా కలిశాననీ అన్నారు.
ఈ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉంటోందంటూ అనేక దేశాలు భావిస్తోన్నాయని, అది వాస్తవం కాదని మోదీ అన్నారు. తాము ఎప్పుడూ శాంతి కోసం పాటుపడుతుంటామని స్పష్టం చేశారు. శాంతి వైపు నిల్చుంటామని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. యుద్ధానికి ఇది సమయం కాదని నేరుగా పుతిన్కే స్పష్టం చేశానని చెప్పారు.
యుద్ధం అనేది ఎప్పుడూ ఏ సమస్యనూ, ఎప్పటికీ పరిష్కరించలేదని మోదీ వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. ఈ దిశగా డొనాల్డ్ ట్రంప్ తీసుకునే ఎలాంటి చర్యలకైనా తమ మద్దతు ఉంటుందని మోదీ తేల్చి చెప్పారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలోనే పుల్స్టాప్ పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఇదే అంశంపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పడంలో భారత్ తనవంతు పాత్ర పోషించే అవకాశం లేకపోలేదని అన్నారు. ఇప్పుడిప్పుడే తమ రెండు దేశాల మధ్య వాణిజ్యరంగంలో ముందడుగు పడుతోందన, తొలుత దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందన వ్యాఖ్యానించారు. మున్ముందు రికార్డు స్థాయిలో వ్యాపారం చేయబోతున్నామని చెప్పారు.
వివిధ అంశాలపై చర్చల్లో ప్రధాని మోదీ తనకంటే బాగా వాదించగలడని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఈ విషయంలో ఆయన తనకంటే సమర్థుడని పేర్కొన్నారు. మోదీని ఉద్దేశించి- హి ఈజ్ మచ్ టఫ్ఫర్ నెగోషియేటర్ అని వ్యాఖ్యానించారు ట్రంప్. ఈ విషయంలో తాను కనీసం పోటీ కూడా పడలేనని అన్నారు.












Click it and Unblock the Notifications