ట్రంప్ హెలికాప్టర్కు సిగ్నల్స్ కట్.. గాల్లోకి లేచి..
అమెరికా అధ్యక్షుడికి భద్రత కల్పించే విషయంలో ఎలాంటి చిన్న పొరపాటుకూ తావుండదు. అలాంటిది స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న అత్యంత పటిష్టమైన 'మెరైన్ వన్' హెలికాప్టర్, ఒక ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపంలోకి వచ్చి కొద్దిలో విమాన ప్రమాదం తప్పుకుందంటే ఆశ్చర్యపోవాల్సిందే. వాషింగ్టన్లోని రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన ఈ ఘోర తప్పు వెనుక వైట్హౌస్లో జరుగుతున్న నిర్మాణ పనులే ప్రధాన కారణమని నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. వైట్హౌస్ ప్రాంగణంలో నిర్మాణాలు జరుగుతుండటంతో హెలికాప్టర్ టేకాఫ్ స్థలాన్ని తాత్కాలికంగా వేరే చోటుకు మార్చారని, దీనివల్ల రేడియో సిగ్నల్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు హెలికాప్టర్ బయలుదేరే సమాచారమే అందలేదని వెల్లడైంది.
అధ్యక్షుడి హెలికాప్టర్ గాల్లోకి లేవడానికి కనీసం మూడు నిమిషాల ముందే కంట్రోల్ టవర్కు స్పష్టమైన హెచ్చరిక వెళ్లాలి. నిబంధనల ప్రకారం మెరైన్ వన్ పైలట్లు తమ టేకాఫ్ మెసేజ్ను రెండుసార్లు పంపినప్పటికీ, అది రీగన్ టవర్ రికార్డర్లలో నమోదు కాలేదు. సిగ్నల్ పరికరాలు ఉన్న ప్రాంతానికి, హెలికాప్టర్ కొత్తగా మారిన తాత్కాలిక టేకాఫ్ పాయింట్కు మధ్య స్పష్టమైన 'లైన్ ఆఫ్ సైట్' లేకపోవడమే ఇందుకు కారణం. పైలట్లు మరో మిలిటరీ బేస్ ద్వారా సమాచారాన్ని అందించడానికి ప్రయత్నించినప్పటికీ ఆ ప్రత్యామ్నాయ మార్గం కూడా పనిచేయలేదు. దీంతో హెలికాప్టర్ బయలుదేరుతుందన్న విషయం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు తెలిసే అవకాశమే లేకుండా పోయింది.

గాల్లోనే ఎదురెదురుగా.. సెకన్ల వ్యవధిలో తప్పిన ముప్పు!
హెలికాప్టర్ బయలుదేరిన సంగతి తెలియని కంట్రోలర్లు, అదే సమయంలో రన్ వేపై సిద్ధంగా ఉన్న 'ఎన్వాయ్ ఎయిర్' ప్రయాణికుల విమానానికి టేకాఫ్ అనుమతి ఇచ్చేశారు. క్షణాల్లోనే విమానం, అధ్యక్షుడి హెలికాప్టర్ రెండూ ఒకే సమయంలో గాల్లోకి లేచాయి. ఒకదానికొకటి క్షితిజ సమాంతరంగా కేవలం 1.3 కిలోమీటర్లు (0.8 మైళ్ళు), నిలువుగా కేవలం 700 అడుగుల అత్యంత ప్రమాదకరమైన దూరంలోకి వచ్చేశాయి. విమానంలోని యాంటీ-కొలైజన్ వార్నింగ్ సిస్టమ్ వెంటనే హెచ్చరించడంతో పాటు, మెరైన్ వన్ పైలట్లు చాకచక్యంగా ప్రయాణికుల విమానాన్ని గమనించి తమ హెలికాప్టర్ను కొద్దిసేపు నిలిపివేశారు . విమానం పైకి వెళ్లిపోవడంతో తృప్తిలో పెద్ద విపత్తు తప్పిపోయింది.
ముందే తెలిసినా నిర్లక్ష్యమే కొంపముంచిందా?
ఈ ఘోర లోపంపై విమానయాన నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరగడానికి వారం రోజుల ముందే హెలికాప్టర్ పైలట్లు, కంట్రోలర్లు కలిసి రేడియో సిగ్నల్ సమస్యలపై చర్చించారు. ఒకవేళ టవర్ సిగ్నల్స్ అందకపోతే మధ్యవర్తుల ద్వారా మెసేజ్ అందించాలని అనుకున్నారే తప్ప, సిగ్నల్ ఎందుకు అందడం లేదనే అసలు మూల కారణాన్ని సరిచేయడంలో తీవ్రంగా విఫలమయ్యారని ఏవియేషన్ భద్రతా నిపుణుడు జెఫ్ గుజ్జెట్టి స్పష్టం చేశారు. కంట్రోలర్లకు మెసేజ్ అందలేదు కాబట్టే వారు విమానానికి అనుమతి ఇచ్చారని, ఇందులో వారి తప్పు ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.
భయపెడుతున్న పాత గాయాలు.. అమెరికా భద్రతపై ప్రశ్నలు!
ఈ తరహా సిగ్నల్ లోపాలు అమెరికాలో కలకలం రేపడానికి బలమైన కారణం ఉంది. 2025 జనవరి 29న రీగన్ విమానాశ్రయం సమీపంలో ఒక ప్యాసింజర్ విమానం, ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొని ఏకంగా 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దారుణ ప్రమాదం తర్వాత రీగన్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో హెలికాప్టర్లు వెళ్లేటప్పుడు అన్ని ల్యాండింగ్లు, టేకాఫ్లు నిలిపివేయాలనే కఠిన నిబంధన తెచ్చారు. ఇంత జరిగినా, స్వయంగా ప్రెసిడెంట్ ప్రయాణించే మెరైన్ వన్ విషయంలోనే రేడియో సిగ్నళ్లు పనిచేయకపోవడం తీవ్ర భద్రతా లోపాలను వేలెత్తి చూపుతోంది. ఈ ఘటన తర్వాత ఎఫ్ఏఏ (FAA) అధికారులు వెంటనే స్పందించి రేడియో రిసీవర్లను ఎయిర్పోర్ట్ టవర్ పైభాగానికి మార్చి టెస్టింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఎన్టీఎస్బీ ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తోంది.














Click it and Unblock the Notifications