ఇరాన్ తో డీల్ లేనట్లేనా ? సర్వనాశనమే- ట్రంప్ ఫైనల్ వార్నింగ్..!
ఇరాన్ (iran)పై ఇజ్రాయెల్ తో కలిసి యుద్దం ప్రారంభించిన అమెరికాకు ఇప్పుడు దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ 48 గంటల్లో సీజ్ ఫైర్ ఒప్పందానికి రాకపోతే విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని అల్టిమేటం ఇచ్చిన ట్రంప్ (Donald trump).. వెనక్కి తగ్గారు. ముందు ఐదు రోజులు సమయం ఇచ్చానని చెప్పిన ట్రంప్.. ఆ తర్వాత దాన్ని మరో పది రోజులకు పొడిగించారు. అయినా ఇరాన్ లొంగకపోవడంతో ఇవాళ మరింత ఘాటు హెచ్చరికలు చేశారు.
ఇరాన్తో సాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి అమెరికా మరింత హేతుబద్ధమైన ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే చర్చలు విఫలమై, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే, ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను, చమురు బావులను, ఖర్గ్ ద్వీపాన్ని పేల్చివేస్తామని హెచ్చరించారు.ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు.ఇరాన్లో తమ సైనిక కార్యకలాపాలను ముగించడానికి ఒక కొత్త, మరింత హేతుబద్ధమైన ప్రభుత్వంతో తీవ్రమైన చర్చలు జరుపుతున్నట్లు ఇందులో వెల్లడించారు.

ఇరాన్ తో చర్చల్లో గొప్ప పురోగతి సాధించామని, కానీ ఏ కారణం చేతనైనా త్వరలో ఒప్పందం కుదరకపోతే, హార్ముజ్ జలసంధిని వెంటనే వ్యాపారం కోసం తెరవకపోతే... తాము ఇంకా ముట్టుకోని అన్ని విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు, చమురు బావులు, ఖర్గ్ ద్వీపాన్ని, అన్ని డీశాలినేషన్ ప్లాంట్లను కూడా పేల్చివేసి, పూర్తిగా నాశనం చేసి తమ పని ముగిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ లో 47 సంవత్సరాల భయానక పాలనలో తమ సైనికుల వధకు ప్రతీకార చర్యగా ఇది ఉంటుందన్నారు. ఇవాళ ఉదయం, ఇరాన్లో చాలా కాలంగా కోరుకుంటున్న అనేక లక్ష్యాలను అమెరికా సైన్యం ఛేదించిందని తెలిపారు. ఇది ఒక "గొప్ప రోజు అన్నారు. యుద్దం ముగించే లక్ష్యంతో తాము విధించిన షరతులకు ఇరాన్ స్థూలంగా అంగీకరించిందని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications