Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..!
ఇరాన్(iran) పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) ఉమ్మడిగా ప్రారంభించిన యుద్దం నాలుగోవారానికి చేరుకుంది. మరోవైపు ఇరాన్ మెడలు వంచాలన్న వీరి వ్యూహాలు ముందుకు సాగడం లేదు. అదే సమయంలో ఇరాన్ గల్ఫ్ దేశాలతో పాటు ఇతర ప్రపంచ దేశాలకూ చుక్కలు చూపిస్తోంది. దీంతో అమెరికాపై ఒత్తిడి అమాంతం పెరిగిపోతోంది. దీంతో చేసేది లేక ఇరాన్ 48 గంటల్లో హార్ముజ్ జలసంధి (strait of hormuz)ని తెరవకపోతే వారి విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని ట్రంప్ డెడ్ లైన్ ఇచ్చారు. దీనిపై ఇరాన్ స్పందించింది.
ఓవైపు అమెరికా, మరోవైపు ఇతర ప్రపంచ దేశాలూ హార్ముజ్ జలసంధిని తెరిచి తమ ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలకుండా చూడాలని అర్థిస్తున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ హార్ముజ్ జలసంధిలో దాదాపు అన్ని నౌకల్ని అడ్డుకుంటున్న ఇరాన్.. ఇప్పుడు కేవలం శత్రుదేశాలు (అమెరికా-ఇజ్రాయెల్, వారికి సహకరిస్తున్న దేశాలు) మినహా మిగిలిన దేశాల నౌకలకు ఎలాంటి ఆటంకాలు కల్పించబోమని వెల్లడించింది. తద్వారా ఆయా దేశాలకు భారీ ఊరటనిచ్చింది.

ప్రపంచ చమురు ఎగుమతుల్లో సుమారు 20శాతం జరిగే కీలకమైన జలమార్గం అయిన హార్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ దాడులే కారణమని అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO)లో ఇరాన్ ప్రతినిధి ఆరోపించారు. ఐఎంఓకు ఇచ్చిన ప్రకటనలలో, సముద్ర భద్రతను మెరుగుపరచడానికి, ఈ ప్రాంతంలో ప్రయాణించే నావికులను రక్షించడానికి సంస్థతో, ఇతర దేశాలతో సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకుని సరైన భద్రతా ఏర్పాట్లు చేసిన పక్షంలో, శత్రు నౌకలు మినహా మిగతా నౌకలు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించవచ్చని వెల్లడించారు.












Click it and Unblock the Notifications