వస్త్ర పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం: 20 మంది మృతి, మరో 24 మందికి గాయాలు
కైరో: ఈజిప్టు రాజధాని కైరోకు సమీపంలోని అల్ క్వాలిబియా పట్టణంలో ఓ వస్త్ర పరిశ్రమలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు స్థానిక అధికారులు వివరాలను మీడియాకు వెల్లడించారు.
అల్ క్వాలిబియా పట్టణంలోని ఓ వస్త్ర పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడేవున్న సిబ్బంది మంటల్లో చిక్కుకుపోయారు. మరికొందరు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే 15 ఫైరింజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. భారీగా మంటలు వ్యాపించడంతో అదుపులోకి తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి కష్టసాధ్యంగా మారింది. గంటలతరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
పరిసర భవనాలకు మంటలు అంటుకోకుండా చర్యలు చేపట్టారు. 20 మంది మృతి చెందారని, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడినవారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
కాగా, కొద్ది రోజుల క్రితం దక్షిణ కైరోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మార్చి 5న అతిహ్ పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది.












Click it and Unblock the Notifications