ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం... 32 మంది మృతి,66 మందికి గాయాలు...
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 32 మంది మృతి చెందగా 66 మంది గాయపడ్డారు. దక్షిణ ఈజిప్టు రాజధాని కైరోకి 460కి.మీ దూరంలో ఉన్న సొహగ్ ప్రావిన్స్లో ఉన్న తహ్తా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో రెండు రైళ్లలోని పలు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద విషయం తెలియగానే పదుల సంఖ్యలో అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రమాద ఘటనపై ఈజిప్టు రైల్వే అధికారులు మాట్లాడుతూ... మొదట ఒక రైల్లో గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఎమర్జెన్సీ బ్రేక్ లాగినట్లు చెప్పారు. ఆ రైలు హఠాత్తుగా ఆగిపోవడంతో... వెనకాలే వచ్చిన రైలు దాన్ని ఢీకొట్టిందని చెప్పారు. రెండు బోగీలు పట్టాలు తప్పగా.. ఒక బోగీ బోల్తా పడినట్లు చెప్పారు.

ఈజిప్టులో తరుచూ రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక్క 2017 సంవత్సరంలోనే దేశంలో 1793 రైలు ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
2002లో జరిగిన రైలు ప్రమాదంలో 373 మంది మృతి చెందారు. గతేడాది మార్చిలోనూ కైరోలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నప్రమాదంలో 13 మంది మృతి చెందారు. సిగ్నల్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు అప్పట్లో వెల్లడించారు. 2019లో కైరో ప్రధాన రైల్వే స్టేషన్లో ఓ ప్యాసింజర్ రైలుకు మంటలు అంటుకుని 20 మంది మృతి చెందారు.
నాలుగు రోజుల క్రితం ఈజిప్టులోని సూయిజ్ కాలువలో ప్రపంచంలోనే అతి భారీ నౌకల్లో ఒకటైన ఎవర్ గివెన్ నౌక ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా దాన్ని అక్కడినుంచి తొలగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నా... అందుకు మరిన్ని రోజులు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా దాదాపు 150 నౌకల రాకపోకలు స్తంభించిపోయాయి. సూయిజ్ కాలువ ప్రారంభమైన 150 ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్తున్నారు. ప్రపంచ వాణిజ్యానికి సూయిజ్ కాలువ కీలకం కావడంతో ఎవర్ గివెన్ నౌకను పక్కకు తప్పించేందుకు అక్కడి అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. కెనాల్లోని సుమారు 20వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వితే తప్ప నౌక బయటపడే పరిస్థితి లేదంటున్నారు.












Click it and Unblock the Notifications