ఆర్డర్ ఆఫ్ ది నైల్- మోదీకి అత్యుత్తమ పౌర పురస్కారం
కైరో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టి రెండు దేశాల పర్యటన ఇవ్వాళ్టితో ముగియనుంది. తొలుత అమెరికాలో అమెరికాలో పర్యటించారు. ఇప్పుడు ఈజిప్ట్లో పర్యటనలో ఉన్నారు. ఈజిప్ట్ను సందర్శించిన తొలి భారత ప్రధానమంత్రి ఆయనే. అమెరికా పర్యటనను ముగించుకుని ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన శనివారం సాయంత్రం ఈజిప్ట్ రాజధాని కైరోలో ల్యాండ్ అయ్యారు. అక్కడ నివసిస్తోన్న ప్రవాస భారతీయులను కలుసుకున్నారు.
ఇవ్వాళ కైరోలోని అత్యంత ప్రాచీనమైన అల్- హకీమ్ మసీదును సందర్శించారు. కైరోలో ఉన్న నాలుగో పురాతన మసీదు ఇది. 11వ శతాబ్దంలో నిర్మితమైంది. 13,560 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. దీని సెంట్రల్ కోర్డ్ యార్డ్ ఒక్కటే 5,000 చదరపు మీటర్లు. కాలక్రమంలో ఈ మసీదు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. చాలావరకు ధ్వంసమైంది. 1970లో దీన్ని దావూదీ బోహ్రా సామాజిక వర్గ ముస్లింలు పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ మసీదు పర్యవేక్షణ వారి ఆధీనంలోనే కొనసాగుతోంది.

అనంతరం ఆయన హీలియోపోలిస్ అమరవీరుల యుద్ధ వాటికను సందర్శించారు. అమర వీరులకు నివాళి అర్పించారు. విజిటర్స్ బుక్లో సంతకం చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో వీరమరణం పొందిన 4,000 మంది భారత జవాన్ల పార్థిక దేహాలకు ఇక్కడే అంత్యక్రియలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ యుద్ధ వాటికను కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ నిర్వహిస్తోంది.
1967-73 మధ్యకాలంలో ఇజ్రాయెల్- ఈజిప్షియన్ ఘర్షణ సమయంలో ఇది పాక్షికంగా ధ్వంసమైంది. 1980లో అప్పటి భారత ప్రభుత్వం దీన్ని పునరుద్ధరించింది. అప్పట్లో ఈజిప్టులోని భారత రాయబార కార్యాలయం.. దీన్ని సంరక్షించింది. అమరులైన భారత జవాన్ల పేర్లతో కూడిన ఓ ప్యానెల్, స్మారక చిహ్నాన్ని అప్పటి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా ప్రధాని మోదీ ఈ స్మారక చిహ్నానికి నివాళి అర్పించారు.
అనంతరం కైరోలో ఆ దేశాధ్యక్షుడు అబ్దెల ఫత్తా అల్-సిసితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మోదీకి ఆర్డర్ ఆఫ్ ది నైల్ను ప్రదానం చేశారు. ఈజిప్ట్లో అత్యుత్తమ పౌర పురస్కారం ఇది. మనదేశంలో భారతరత్నతో సమానం. స్వదేశంతో పాటు వివిధ రంగాల్లో సేవలను అందించిన వారికి ఈజిప్ట్ ఈ పురస్కారాన్ని అందిస్తోంది. జిమ్మీ కార్టర్, యూరీ గగారిన్, నెల్సన్ మండేలా, సుహార్తో.. వంటి పలువురు ప్రముఖు ఈ అవార్డును అందుకున్న వారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications