భారత్-బంగ్లా పోరు తీవ్రం..! ఢిల్లీలో ఉద్రికతలు..! రాయబారికి సమన్లు..!
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హిందూ యువకుడిపై మూకదాడి చేసి హతమార్చిన వ్యవహారం ముదురుతోంది. ఈ దారుణ హత్యపై
భారత్ లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద హిందూ సంఘాలు నిరసనలకు దిగాయి. హైకమిషన్ లోకి చొచ్చుకుపోయేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో హైకమిషన్ ఘటనలపై వివరణ ఇవ్వాలని బంగ్లాదేశ్ మన రాయబారికి సమన్లు పంపింది.
గత వారం బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్లో హిందువు అయిన దీపు చంద్ర దాస్ను ఇస్లామిక్ మూక దారుణంగా హత్య చేసింది. దీనిపై భారత్ ఇప్పటికే తమ నిరసన తెలిపింది. అయితే ఇవాళ ఉన్నట్లుండి న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ బయట పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దారుణాలను, వారి మతపరమైన స్థలాలను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ , బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.

బంగ్లాదేశ్ అధికారులు దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైకమిషన్ బారికేడ్లను ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలని, బంగ్లాదేశ్ లో మైనారిటీలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. హైకమిషన్ వద్ద నిరసనలు జరిగే అవకాశం ఉందని ముందుగానే భద్రతా సంస్థలు అలర్ట్ చేయడంతో భవనం బయట గట్టి భద్రత కల్పించారు. పోలీసులు, పారామిలిటరీ దళాలను మోహరించారు.

మరోవైపు ఈ నిరసనలపై బంగ్లాదేశ్ స్పందించింది. భారత రాయబారికి వివరణ ఇవ్వాలని సమన్లు పంపింది. దీంతో ఇరు దేశాల మధ్య నిరసనలు కాస్తా దౌత్య వివాదం దాకా వెళ్లినట్లయింది. ఇప్పటికే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ లోని పలు నగరాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవి ఢిల్లీకి కూడా విస్తరించడంతో ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications