అద్భుతం: ఆ చిన్నారికి ముగ్గురు తల్లిదండ్రులు!
న్యూయార్క్: సాధారణంగా పుట్టిన ప్రతి ఒక్కరికీ తల్లిదండ్రులు ఇద్దరే ఉంటారు. కొన్నిసార్లు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరే ఉన్నా.. పెంచే బాధ్యత మరొకరు తీసుకుంటే ఆ బిడ్డ ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ అవుతుంది. కానీ, ప్రస్తుతం శాస్త్రవేత్తలు సృష్టించిన అద్భుతంతో ఓ బిడ్డకు ముగ్గురు తల్లిదండ్రులయ్యారు. ముగ్గురి జన్యువులతో జన్మించిన తాజా శిశువు ఇప్పుడు పెద్ద చర్చగా మారాడు.
న్యూసైంటిస్ట్ పత్రిక కథనం ప్రకారం ఆ వివరాలిలా ఉన్నాయి.. మెక్సికోలో కొత్త టెక్నిక్ ద్వారా ఆ శిశువుకు ప్రాణం పోశారు. ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏలతో ఆ శిశువు పుట్టినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఐదు నెలలు ఆ మగ శిశువు ఆరోగ్యంగా ఉన్నాడు. దీన్ని వైద్యశాస్త్రంలోనే ఓ అద్భుతంగా భావిస్తున్నారు.
ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏలతో ఉన్న పిండాన్ని అభివృద్ధి చేశారు. ఆ పిండానికి తల్లి, తండ్రితో పాటు మరో దాతకు చెందిన డీఎన్ఏను ఎక్కించారు. ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏలతో పుట్టిన మగ శిశువుకు ఎటువంటి జన్యుపరమైన వ్యాధులు సంక్రమించకుండా డాక్టర్లు జాగ్రత్తపడ్డారు.
శిశువు తల్లి జోర్డాన్ దేశస్థురాలు. ఆమెకు ఉన్న జన్యు లోపాలు ఆ శిశువులో ఉండవని డాక్టర్లు అంటున్నారు. ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏలతో పిల్లలు పుట్టడం సైన్స్ చరిత్రలో అద్భుతమని, జన్యు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న కుటుంబాలకు ఈ కొత్త టెక్నిక్ ఆశాదీపంగా ఉంటుందని డాక్టర్లు భావిస్తున్నారు.
ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏలతో పిల్లలకు జన్మనివ్వడం ఇదే తొలిసారి కాదని, కాకపోతే ఈ సారి వినియోగించిన టెక్నిక్ మాత్రం నూతనమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. మైటోకాండ్రియా డోనేషన్ అనే పద్ధతితో సాగే ఈ టెక్నిక్పై కొంత వివాదం నెలకొని ఉంది. మైటోకాండ్రియాలో ఉన్న లోపాల వల్ల లీగ్ సిండ్రోమ్ వస్తుంది. ఆ వ్యాధి నుంచి విముక్తి పొందేందుకు ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏలతో ఈ చిన్నారికి ప్రాణం పోశారు.
న్యూయార్క్లోని న్యూ హోప్ ఫెర్టిలిటీ సెంటర్లోని జాన్ జాంగ్ శాస్త్రవేత్త ఈ టెక్నిక్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. తల్లి అండంలోని న్యూక్లియస్ను తీసివేసి, దాత అండంలోని న్యూక్లియస్తో రిప్లేస్ చేసి పిండాన్ని అభివృద్ధి చేశారు. కాగా, ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏలతో పిల్లలు కనేందుకు బ్రిటన్ చట్టపరంగా అనుకూలత వ్యక్తం చేసింది.