చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హౌస్ అరెస్ట్?: సైన్యం తిరుగుబాటు: ఏం జరుగుతోంది - క్లారిటీ ఏంటీ
బీజింగ్: చైనా అధినేత గ్ఝి జిన్పింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారా?.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆయనను అదుపులోకి తీసుకుందా?.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయనను పదవి నుంచి తొలగించారా?..బీజింగ్లో ఏం జరుగుతోంది? సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోన్న ప్రశ్నలు ఇవి. దీనికి అనుగుణంగా పీఎల్ఏ సైనిక వాహనాలు రాజధాని బీజింగ్ వైపు పరుగులు తీయడానికి సంబంధించిన కొన్ని వీడియోలో పోస్ట్ అయ్యాయి.
ఆర్మీ చీఫ్గా..
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చీఫ్గా చైనా కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్లు జిన్పింగ్ను తొలగించిన తరువాత గృహనిర్బంధంలో ఉంచినట్లు పలు చైనా సోషల్ మీడియా హ్యాండిల్స్ స్పష్టం చేశాయి. బీజింగ్ పీఎల్ఏ సైనిక బలగాల ఆధీనంలోకి వెళ్లిందంటూ చైనా నెటిజన్లు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా పలు పోస్టులు షేర్ చేశారు. చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావో, మాజీ ప్రధానమంత్రి వెన్ జిబావోలను స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యుడు సాంగ్ పింగ్ను ఒప్పించారని, సెంట్రల్ గార్డ్ బ్యూరో నియంత్రణను కొనసాగించారని స్థానిక మీడియా తెలిపినట్లు వార్తలొచ్చాయి.
ఉజ్బెక్ నుంచి తిరిగొచ్చాక..
ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో ఏర్పాటైన షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశాన్ని ముగించుకుని ఈ నెల 16వ తేదీన జిన్పింగ్ బీజింగ్కు తిరిగి వచ్చారని, ఆ వెంటనే ఆయనను పీఎల్ఏ సైనిక బలగాలు నిర్బంధంలోకి తీసుకున్నారని, ప్రస్తుతం ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారనే వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలేవీ నిజం కాదని, వదంతులు మాత్రమేనంటూ మరికొందరు చైనా నెటిజన్లు స్పష్టం చేస్తోన్నారు.
లంచం తీసుకున్నట్లు..
జిలిన్ ప్రావిన్స్లోని చాంగ్చున్లో గల మాజీ వైస్ పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి సన్ లిజున్కు పెరోల్ వచ్చే అవకాశం లేకుండా సస్పెండెడ్ డెత్ సెంటెన్స్ను విధించారని, ఆయన 646 మిలియన్ యువాన్ల లంచం తీసుకున్నందుకు స్థానిక న్యాయస్థానం దోషిగా తేల్చిందని చైనా సెంట్రల్ టెలివిజన్ తెలిపింది. స్టాక్ మానిప్యులేషన్తో పాటు అనధికారికంగా గన్ను కలిగి ఉన్నాడని కూడా ఆరోపణలు వెల్లువెత్తినట్లు మీడియా తెలిపింది.
ఆ భేటీలో నిర్ణయం..
బ్లూమ్బర్గ్ కథనం ప్రకారం- కీలకమైన కమ్యూనిస్ట్ పార్టీ సమావేశానికి ముందు పార్టీ ఉన్నత స్థాయి అధికారులను తొలగించడం ఆనవాయితీగా వస్తోందని, ఆ క్రమంలోనే జిన్పింగ్ అంగీకారంతోనే ఆయనను పదవి నుంచి తొలగించాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. అక్టోబర్ 16వ తేదీన చైనా కమ్యూనిస్ట్ పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం జరిగే అవకాశం ఉంది. వచ్చే అయిదు సంవత్సరాలకు అవసరమైన పార్టీ నాయకత్వాన్ని ఈ భేటీలోనే నిర్ణయించనున్నట్లు చైనా మీడియా పేర్కొంది.
సుబ్రహ్మణ్య స్వామి ఏం చెప్పారు?
బ్లూమ్బర్గ్ కథనం తరువాత సోషల్ మీడియాలో పోస్టులు ఈ వార్తలు వెలువడటానికి కారణమైనట్లు అంచనాలు ఉన్నాయి. ఈ వార్తలపై భారతీయ జనత పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సైతం స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. జిన్పింగ్ను హౌస్ అరెస్ట్ చేశారనేది వదంతులు మాత్రమేనని చెప్పారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.