భారత పైలెట్ ను వదిలేయండి: లేదంటే..ఆసియా ఖండంలో అనాథలవుతాం: పాక్ మాజీ ప్రధాని మనవరాలు
వాషింగ్టన్: పాకిస్తాన్ చెరలో ఉన్న మనదేశ వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావాలంటూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. రాజకీయంగా, దౌత్యపరంగా పాకిస్తాన్ పై కేంద్రప్రభుత్వం ఒత్తిడి తీసుకుని వస్తోంది. వివిధ దేశాధినేతలు కూడా భారత డిమాండ్ కు మద్దతు పలుకుతున్నాయి. పాకిస్తాన్ జెనీవా ఒప్పందానికి లోబడి వ్యవహరించాలంటూ సూచిస్తున్నాయి. యుద్ధం జోలికి వెళ్లొద్దంటూ హితవు పలుకుతున్నాయి. ఇదే సమయంలో- అభినందన్ కు మద్దతుగా పాకిస్తానీయులు కూడా గళం విప్పుతున్నారు.
అభినందన్ ను సురక్షితంగా స్వదేశానికి అప్పగించాలని పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ రచయిత్రి ఫాతిమా భుట్టో డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె న్యూయార్క్ టైమ్స్ కు ఓ వ్యాసాన్ని రాశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కోరారు. పాకిస్తాన్ కు సంబంధించిన అనేక విషయాలను ఆమె వెల్లడించారు.
జుల్ఫికర్ భుట్టో మనవరాలు..
ఫాతిమా భుట్టో మరెవరో కాదు.. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోకు స్వయానా మనవరాలు. మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో మేనకోడలు. అభ్యుదయ భావాలు ఉన్న మహిళగా ఫాతిమా భుట్టోకు గుర్తింపు ఉంది. ఆమె రచనలే ఆమెకు ఈ పేరును తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆమె న్యూయార్క్ లో నివసిస్తున్నారు. వేర్పాటువాద, కరడుగట్టిన మతతత్వ భావాలకు ఆమె విరుద్ధం.
భారత్ పై దాడులు చేయడానికి సరిహద్దులను దాటుకుని వచ్చిన పాకిస్తాన్ వైమానిక దళ ఎయిర్ క్రాఫ్ట్ లను తరుముకుంటూ మిగ్ 21 బైసన్ లో దాయాది దేశ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లిన అభినందన్ ను ఆ దేశ సైనిక బలగాలు బంధించిన విషయం తెలిసిందే. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే సామాజిక మాధ్యమాల్లో ఆయనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వెల్లువెత్తాయి. వాటిని చూసిన వెంటనే ఫాతిమా భుట్టో స్పందించారు.
అనాథలుగా మారాలనుకోవట్లేదు..
అభినందన్ ను వెంటనే విడుదల చేయాలని ఫాతిమా భుట్టో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు. ఎంత త్వరగా ఆ పని చేయగలిగితే.. అంత మంచిదని హితవు పలికారు. అభినందన్ ను విడుదల చేయాలని సూచిస్తూ అంతర్జాతీయ స్థాయిలో వస్తోన్న ఒత్తిళ్లను ఎదిరించ వద్దని ఆమె చెప్పారు. అభినందన్ ను విడుదల చేయకుండా.. నిర్బంధాన్ని కొనసాగించడం పాకిస్తాన్ కు ఎంత మాత్రమూ మేలు చేయదని అన్నారు. అలా చేస్తే ఆసియా ఖండంలో ఏకాకిగా మిగులుతామని ఫాతిమా భుట్టో ఆందోళన వ్యక్తం చేశారు. తాను గానీ, పాకిస్తాన్ ప్రజలు గానీ అంతర్జాతీయంగా అనాథలుగా మారకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు.
తరం మారింది.. శాంతిని కోరుకుంటోంది:
పాకిస్తాన్ ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణానికి అలవాటు పడుతున్నారని చెప్పారు. అభినందన్ ను వెంటనే విడుదల చేయడం ద్వారా పాకిస్తాన్ కూడా శాంతిని కోరుకుంటోందనే సందేశాన్ని ఇచ్చినట్టవుతుందని మానవత్వం మిగిలి ఉందని చెప్పుకోవడానికి ఇదే సరైన సమయమని ఫాతిమా భుట్టో అన్నారు. తమ జీవితం మొత్తం యుద్ధాలతో గడిచిపోయిందని, పాకిస్తాన్ సైనికులు గానీ, భారత సైనికులు గానీ యుద్ధంలో మరణించాలని రెండు దేశాల ప్రజలు ఎవ్వరూ కోరుకోవట్లేదని అన్నారు. ఇప్పుడు తరం మారిందని చెప్పారు. తన తరానికి చెందిన ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కోరుకుంటున్నారని, స్వేచ్ఛగా తమ భావాలను వెల్లడించడానికి సిద్ధపడుతున్నారని ఫాతిమా తెలిపారు.
గత చరిత్ర అంతా రక్తసిక్తమే
పాకిస్తాన్ గత చరిత్ర అంతా రక్తసిక్తమేనని ఫాతిమా అన్నారు. అలాంటి సంఘటనలు పునరావృతం కావాలని, హింసకు ఎవరూ గురి కాకూడదని ఆమె చెప్పారు. తమ దేశ చరిత్ర అంతా సైనిక చర్యలు, నియంతల పాలన, ఉగ్రవాదమయమని అన్నారు. ఈ తరానికి చెందిన యువత దీన్ని సహించడానికి సిద్ధంగా లేదని చెప్పారు.
పొరుగు దేశంతో సఖ్యతగా ఉన్నట్లు ఎప్పుడూ చూడలేదు
పాకిస్తాన్ పొరుగు దేశమైన భారత్ తో ఎప్పుడూ సఖ్యతగా, స్నేహ సంబంధాలను కొనసాగించిన సందర్భాన్ని తనకు ఊహ తెలిసినప్పటి నుంచి చూడలేదని ఫాతిమా భుట్టో చెప్పారు. ప్రస్తుతం ఆమెకు 34 సంవత్సరాలు. అభివృద్ధి చెందాలంటే పొరుగు దేశాలతో సఖ్యత అవసరమని, దౌత్య సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఆమె సూచించారు. `సే నో టు వార్` అనే హ్యాష్ ట్యాగ్ పాకిస్తాన్ లో కూడా టాప్ ట్రెండింగ్ లో ఉందని, దీన్ని బట్టి, పాకిస్తాన్ ప్రజలు కూడా యుద్ధాన్ని కోరుకోవట్లేదని విషయాన్ని అర్థం చేసుకోవచ్చని ఫాతిమా వెల్లడించారు.