భారత్లో చరిత్ర సృష్టించిన ఐదు బ్రాండ్లు.. ఇవి ప్రజల్లోకి ఎలా చొచ్చుకెళ్లాయి?
కొన్ని విషయాలు మనకు అలా గుర్తుండిపోతాయి. కళ్లు తిప్పుకోనివ్వని కొన్ని ప్రటకనలు, మైరచిపోయేలా చేసే రుచులు మనల్ని ఏళ్లపాటు వెంటాడుతుంటాయి. దీంతో మనం అ బ్రాండ్ర్లతో ప్రేమలో పడిపోతాం. ఆ ఉత్పత్తులకు అలవాటు పడిపోతాం.
భారత్లో ఇలానే కొన్ని దేశీయ బ్రాండ్లు మార్కెట్లో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాయి. దశాబ్దాల తరబడి కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంటున్నాయి.
1947లో భారత్ స్వతంత్రం పొందిన తర్వాత భారత్ స్వావలంబన సాధించడానికి ఈ బ్రాండ్లు ఎంతో తోడ్పడ్డాయి. ఇవి ప్రజల రోజువారీ జీవితాల్లో భాగం కావడంతోపాటు ఆయా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి.
స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్ల తర్వాత, ఇప్పటికీ మార్కెట్లో ఈ బ్రాండ్లు తమదైన ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. ప్రపంచ పెట్టుబడి దారులను కూడా ఆకర్షిస్తున్నాయి. అలా భారతీయులను మెప్పించిన కొన్ని బ్రాండ్లను ఇప్పుడు చూద్దాం.
- టెస్లా కార్లు ఇండియాకి ఎప్పుడొస్తాయి? ఎందుకు ఆలస్యం అవుతోంది?
- జుగాడ్ జీప్: 'లీటర్ పెట్రోల్కు 50KM మైలేజ్. ఆనంద్ మహీంద్రాకు దీన్ని ఇవ్వలేను.. కొత్తది తయారు చేసి ఇస్తా'
అమూల్
భారత్లో ఏ మూలకు వెళ్లినా అమూల్ పాల ఉత్పత్తులు కనిపిస్తాయి. డెయిరీ కెటగిరీలో ఈ సంస్థ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంటుంది. భారత్లో తొలి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీల్లో అమూల్ కూడా ఒకటి.
పశ్చిమ రాష్ట్రం గుజరాత్లో ఒక స్వయం సహాయక సంఘంగా ఇది మొదలైంది. డెయిరీ వ్యాపారం కోసం అక్కడ వేల మంది పాడి రైతులు కలిసి దీన్ని ఏర్పాటుచేశారు.
భారత పాల విప్లవానికి ఆద్యుడుగా మన్ననలు పొందిన డాక్టర్. వర్గీస్ కురియన్ నాయకత్వంలో ఈ డెయిరీ వ్యాపారం మరింత వేళ్లూనుకుంది. నేడు లక్షల మందికి ఈ సంస్థ ఉపాధి కల్పిస్తోంది.
మల్టీ నేషనల్ కంపెనీలు (ఎంఎన్సీ)ల నుంచి గట్టి పోటీ వస్తున్నప్పటికీ, డెయిరీ రంగంలో అమూల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.
దేశంలోని పరిస్థితులను కూడా తమ ప్రకటనల్లో అద్దం పట్టినట్లుగా అమూల్ చూపిస్తుంది. రాజకీయ కుంభకోణం లేదా నటుల మృతి ఇలా అన్ని ప్రధాన సమయాల్లో తమ ''అమూల్ గర్ల్’’తో అమూల్ తమదైన శైలిలో ప్రకటనలు ఇస్తుంది.
దీన్ని భారత్కు చెందిన దేశీయ సామాజిక సంస్థగా చెప్పుకోవచ్చు.
- ఎలాన్ మస్క్: 'పక్కదారి పట్టించే ట్వీట్ల’తో చైర్మన్ పదవి నుంచి ఉద్వాసన
- టెస్లా అధినేత ఎలాన్ మస్క్పై ఆర్థిక మోసం కేసు
పార్లే-జీ బిస్కెట్లు
''పార్లే ప్రోడక్ట్స్’’ నుంచి వచ్చిన గ్లూకోజ్ బిస్కెట్ పార్లే-జీ. ప్రపంచ వ్యాప్తంగా భారీగా బిస్కెట్లు అమ్ముతున్న బ్రాండ్లలో ఇదీ ఒకటి. భారత్లో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రాండ్లలోనూ దీని పేరు ప్రధానంగా వినిపిస్తుంది.
భారత్ మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన బిస్కెట్గా దీనికి పేరుంది.
''స్వదేశీ ఉద్యమం’’ సమయంలో ఇది పుట్టింది. 1900లో స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా దేశం స్వావలంబన సాధించేందుకు కృషిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అప్పట్లో భారత బిస్కెట్ మార్కెట్లలో అంతర్జాతీయ బ్రాండ్ల ఆధిపత్యం కొనసాగేది.
మార్కెట్లోకి వచ్చిన కొన్ని రోజులకే ఇది ప్రజలకు చేరువైంది. టీతోపాటు తప్పకుండా తీసుకోవాల్సిన బిస్కెట్గా ఇది మన్ననలు పొందింది.
కులం, మతం, తరగతి ఇలా ఎలాంటి విభేదాలు లేకుండా భారతీయులంతా టీలో ముంచుకొని పార్లే-జీ బిస్కెట్లను ఆస్వాదిస్తుంటారు.
మారుతి
ఒకప్పుడు భారత్లో అతికొద్ది మంది మాత్రమే కార్లను కొనుక్కోగలిగేవారు. మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక కలగానే మిగిలిపోయేది. దీంతో ఊహించని రీతిలో రూ.50,000 (625 డాలర్లు)కే కార్లను విక్రయిస్తామంటూ మార్కెట్లోకి మారుతి అడుగుపెట్టింది.
ఈ 800సీసీ కార్లు చూడటానికి చాలా స్మార్ట్గా కనిపించేవి. 1960ల నుంచి 1990ల వరకు లగ్జరీ కార్లుగా పేరుపొందిన అంబాసిడర్లు కంటే ఇవి కాస్త చిన్నగా, కొత్తగా కనిపించేవి.
ముఖ్యంగా భారత్లో మధ్యతరగతి ప్రజలకు చేరువ కావాలని మారుతి లక్ష్యం పెట్టుకుంది. వారి అభిరుచులకు తగినట్లే తమ మోడళ్లను తీసుకొచ్చేది. ఒక విధంగా చెప్పాలంటే ప్రైవేటు రవాణా రంగాన్ని ఈ సంస్థ ప్రజస్వామ్యీకరించింది.
ఈ కార్ను కొనుగోలు చేయడం ద్వారా సమాజంలో తాము మరో మెట్టు పైకి ఎక్కొచ్చని కుటుంబాలు గ్రహించాయి. అక్కడి నుంచి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ.. ఇప్పుడు లగ్జరీ కార్లవైపుగా అడుగులు వేస్తున్నాయి.
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- IPO అంటే ఏమిటి? దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
నిర్మా
1980ల వరకు భారత్ డిటర్జెంట్ మార్కెట్లో పాత బ్రాండ్ల ఆధిపత్యం కొనసాగేది. కానీ, గుజరాత్ అహ్మదాబాద్లో మూలాలున్న నిర్మా.. ఆ బ్రాండ్లను వెనక్కి నెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.
అప్పట్లో ప్రకటనలపై వ్యాపారవేత్తలు పెద్దగా డబ్బులు పెట్టడానికి ముందుకు వచ్చేవారు కాదు. కానీ, నిర్మా మాత్రం టవీలో ప్రటకనలపై భారీగా ఖర్చు పెట్టేది.
అప్పట్లో వచ్చిన ''వాషింగ్ పౌడర్ నిర్మా’’ పాట ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ పాటకు రీమిక్స్లు కూడా వచ్చాయి.
ముందుచూపుతోపాటు తాము నిర్దేశించుకున్న ఉన్నతమైన లక్ష్యాలు మార్కెట్లో నిర్మాకు కలిసొచ్చాయి.
మరోవైపు ప్రజలు నిజంగా ప్రాధాన్యమిచ్చే అంశాల ఆధారంగా నిర్మా వ్యూహాలు సిద్ధం చేసేంది. తక్కువ ధరకు మంచి నాణ్యతతోకూడిన ఉత్పత్తులను అందించడంతోపాటు పంపిణీ వ్యవస్థపైనా సంస్థ దృష్టి పెట్టేది.
అలా లక్షల మంది భారతీయులతో కంపెనికి విడదీయరాని బంధం ఏర్పడింది.
- రిలయన్స్ జియో: టెలికాం కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతుంటే 'జియో'పై కాసుల వర్షం ఎలా?
- వొడాఫోన్ ఐడియాకు మూడు నెలల్లో రూ. 51,000 కోట్ల నష్టానికి కారణాలేమిటి?
జియో
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రోడక్ట్గా మార్కెట్లోకి వచ్చిన జియో నేడు భారత్లోని అతిపెద్ద టెలికాం బ్రాండ్లలో ఒకటి.
ఆసియాలోని అత్యధిక ధనవంతుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ.. 2016లో జియోను ఆవిష్కరించినప్పుడు.. భారత మార్కెట్లో మల్టీనేషనల్ బ్రాండ్ల ఆధిపత్యం కొనసాగేది.
అయితే, జియో రాకతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆరు నెలలపాటు ఉచితంగా డేటా, కాల్స్ను ఇస్తామని జియో ప్రకటించింది. దీంతో ఈ సిమ్ల కోసం ప్రజలు పోటెత్తారు.
భారత్లో డిజిటల్ దిశగా నెమ్మదిగా పడుతున్న అడుగుల్లో జియో రాకతో వేగం పెరిగింది.
ప్రపంచ టెక్ దిగ్గజాలకు భారత్ ప్రధాన మార్కెట్గా మారడంలో జియో పాత్ర కూడా ఉంది. మరోవైపు పటిష్ఠమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను సృష్టించడంలోనూ జియో ప్రధాన పాత్ర పోషించింది. జియో డేటాతో ప్రజల్లో సాంస్కృతిక, సామాజిక మార్పులు కూడా చాలా వచ్చాయి.
అయితే, ఈ డిజిటల్ విప్లవమే భారత్లో ప్రజలు వర్గాలుగా విడిపోవడానికి కూడా ఒక కారణమని విమర్శలు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత పూర్తి కథ
- అగ్నిపథ్ పథకంపై నేపాలీ గూర్ఖాలు ఎందుకు కోపంతో ఉన్నారు... వారు, పాక్, చైనా ఆర్మీలో చేరాలనుకుంటున్నారా?
- ఇండియా, పాకిస్తాన్.. రెండు జట్లకూ ఆడిన క్రికెటర్
- అపోలో: ఈ ఫొటోలు చూస్తే మీరు కూడా చంద్రుడిపైకి వెళ్లిన ఫీల్ కలుగుతుంది
- బిల్కిస్ బానో గ్రామం రంథిక్ పూర్ నుంచి ముస్లిం కుటుంబాలు ఎందుకు వెళ్లిపోతున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)