ఇజ్రాయెల్ చూపిన దారిలోనే ఇరాన్..! మొస్సాద్ కు చావు దెబ్బ..!
అమెరికాతో ఇరాన్ అణు ఒప్పంద చర్చలు విఫలం కాగానే ఆ దేశంపై దాడికి దిగిన ఇజ్రాయెల్ కు ఈ పోరులో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇరాన్ పై ముందుగా దాడి చేసి రాజధాని టెహ్రాన్ పై పట్టు సాధించామని చెప్పుకుంటున్న ఇజ్రాయెల్ కు ఇవాళ చుక్కలు కనిపించాయి. ఆ దేశ నిఘా సంస్థ మొస్సాద్ టార్గెట్ గా ఇరాన్ జరిపిన దాడుల్లో భారీ నష్టం జరిగింది. మొస్సాద్ కేంద్ర కార్యాలయంతో పాటు ఆపరేషన్స్ సెంటర్ కూడా ధ్వంసమయ్యాయి.
ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మొస్సాద్ కేంద్ర కార్యాలయంతో పాటు ఆపరేషన్ సెంటర్ పైనా తాము క్షిపణి దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఈ మేరకు వీడియో ఫుటేజ్ కూడా విడుదల చేసింది. ఇందులో అగ్నికి ఆహుతవుతున్న మొస్సాద్ కేంద్ర కార్యాలయం కనిపించింది. మంటలు ఆర్పుతున్న సిబ్బంది కూడా ఇందులో ఉన్నారు. దాడులతో అక్కడ దట్టమైన పొగలు కమ్ముకున్నట్లు వీడియో పుటేజ్ లో కనిపించింది.

మొస్సాద్ కేంద్ర కార్యాలయం, ఆపరేషన్స్ సెంటర్ లక్ష్యంగా ఇరాన్ మిసైల్ దాడులు చేయడం వెనుక ఓ కీలక కారణం ఉంది. ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయకుండా అడ్డుకునేందుకు వారి అణుస్ధావరాలు, అణు శాస్త్రవేత్తలపై దాడులు చేసి హతమార్చిన ఇజ్రాయెల్ కు అదే బాటలో వెళ్లి వారి నిఘా సమాచారానికి కీలకమైన మొస్సాద్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. తద్వారా ఇజ్రాయెల్ చూపిన బాటలోనే వెళ్లి ఆ దేశానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ లోని ప్రభుత్వ టెలివిజన్ కార్యాలయంపై దాడులు చేసి ఇద్దరిని బలిగొంది. ఈ దాడికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ కేంద్ర కార్యాలయం, ఆపరేషన్ సెంటర్ పై ఇరాన్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. మొస్సాద్ ఈ కార్యాలయం నుంచే పక్కా నిఘా సమాచారాన్ని సైన్యానికి ఇవ్వడం ద్వారా ఇరాన్ లో పక్కాగా దాడులు చేస్తోంది. ఇప్పుడు అదే కార్యాలయంపై దాడులతో ఇజ్రాయెల్ దూకుడుకు ఇరాన్ కళ్లెం వేసేందుకు ప్రయత్నించింది.












Click it and Unblock the Notifications