కుకీ తిన్నాడని.. రూ. 1.9 కోట్ల ప్యాకేజీ ఉద్యోగిని పీకేసిన ఫోర్డ్ కంపెనీ!
అమెరికాలోని ఫోర్డ్ ట్రక్ ప్లాంట్లో చిన్న కుకీ వివాదం పెద్ద ఉద్యోగ వివాదంగా మారింది. కెంటకీ రాష్ట్రం లూయిస్విల్లేలోని ఫ్యాక్టరీలో 11 ఏళ్లుగా పనిచేస్తున్న 60 ఏళ్ల కర్ట్ క్రోమ్ను, చాక్లెట్ కుకీ దొంగిలించారనే ఆరోపణతో ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆయన వెల్లడించారు.
క్రోమ్ చెప్పిన వివరాల ప్రకారం, ఆయన ఫోర్డ్లో ఏడాదికి సుమారు రూ.1.9 కోట్ల జీతం పొందుతున్నారు. వారానికి సగటున 60 గంటల వరకు పనిచేసేవాడినని, సంస్థలో తన పనితీరుపై ఎలాంటి తీవ్రమైన అభ్యంతరాలు గతంలో లేవని ఆయన అంటున్నారు. అయితే రూ.186 విలువైన కుకీ కారణంగా తన కెరీర్కు మచ్చ వేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఫోర్డ్ ఉద్యోగి వాదన ఏంటి?
ఫ్యాక్టరీలో ఉన్న సమయంలో తన షుగర్ లెవల్స్ పడిపోతున్నట్లు అనిపించడంతో క్యాంటీన్లో చాక్లెట్ కుకీ కొనుగోలు చేశానని క్రోమ్ చెప్పారు. కొన్ని రోజుల తర్వాత సూపర్వైజర్ తనను పిలిచి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారని, కారణం అడగగా కుకీని దొంగిలించారనే ఆరోపణ వినిపించిందని ఆయన వివరించారు.
తాను ఆ కుకీకి డబ్బు చెల్లించానని, దానికి సంబంధించిన బిల్లు స్క్రీన్షాట్ కూడా ఉందని చెప్పినా వినకుండా ఫ్యాక్టరీ ప్రాంగణం నుంచి బయటకు పంపించారని క్రోమ్ ఆరోపించారు. గత ఏడాది కంపెనీ క్యాంటీన్లోనే సుమారు రూ.1.14 లక్షలు ఖర్చు చేశానని, అలాంటి తాను ఒక కుకీ కోసం దొంగతనం చేయాల్సిన అవసరం లేదని ఆయన వాదిస్తున్నారు.
బిల్లు చూపిన తర్వాత ఏం జరిగింది?
తర్వాత బిల్లు ఆధారంగా తాను తప్పు చేయలేదని తేలిందని, ఉద్యోగానికి తిరిగి రావాలని యూనియన్ ప్రతినిధి తనను సంప్రదించారని క్రోమ్ తెలిపారు. అయితే తనను అవమానించిన చోట మళ్లీ పనిచేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ఫోర్డ్ నుంచి అధికారిక స్పందన వచ్చినట్లు స్పష్టమైన సమాచారం లేదు.
ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చిన్న కొనుగోలు విషయంలో ఉద్యోగిపై తీసుకున్న చర్య తగినదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పెద్ద సంస్థల్లో క్రమశిక్షణ, ఉద్యోగి గౌరవం, విచారణ విధానం ఎలా ఉండాలనే చర్చకు ఈ సంఘటన కారణమైంది.












Click it and Unblock the Notifications