శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్!
Sri Lanka: నిధుల దుర్వినియోగం కేసులో శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఓ సీనియర్ పోలీసు అధికారి ధ్రువీకరించారు. విచారణ కోసం కొలంబోలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ)కి హాజరు కావాలని విక్రమసింఘేను పిలవగా.. అక్కడ 76 ఏళ్ల వయసున్న ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఆయనకు సమన్లు అందజేసి విచారణ కూడా చేపట్టారు. ప్రస్తుతం ఆయన సీఐడీ ఆధీనంలోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ అరెస్టు సెప్టెంబర్ 2023లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించినది. విక్రమసింఘే తన భార్య యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనడానికి లండన్కు వెళ్లారు. అయితే అధికారులు ఈ పర్యటన అధికారిక కార్యక్రమం కాదని, ప్రభుత్వ నిధులతో జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇది ఆయన ఇతర విదేశీ పర్యటనలలో ఒక భాగం. అయితే హవానాలో జీ-77 సదస్సుకు హాజరై తిరిగి వస్తూ.. లండన్ కు వెళ్లినప్పుడు తన భార్య ఖర్చులను ఆమె పెట్టుకుందని.. ప్రభుత్వ నిధులను ఉపయోగించలేదని రణిల్ విక్రమసింఘే వాదిస్తున్నారు. కానీ సీఐడీ మాత్రం ప్రభుత్వ నిధులను వాడారని అంటోంది. ఆయనను ఫైనాన్షియల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ విచారించి.. కొలంబో ఫోర్ట్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చింది.

రణిల్ విక్రమసింఘే.. గొటబాయ రాజపక్స రాజీనామా తర్వాత జులై 2022లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. శ్రీలంక ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో ఆయనకు మంచి పేరు వచ్చింది. అయితే, సెప్టెంబర్ 2024లో జరిగిన ఎన్నికలలో ఆయన తిరిగి గెలవలేకపోయారు.












Click it and Unblock the Notifications