శిఖరంపై నగ్నంగా ఫోటో, అరెస్ట్: అందుకే భూకంపం!
కౌలాలంపూర్: కినబాలు పర్వతం పైన దుస్తులు విప్పిన ఆరోపణల పైన మలేషియా పోలీసులు మంగళవారం నాడు ఇద్దరు కెనడియన్లను, ఓ డచ్, ఓ బ్రిటన్ వ్యక్తిని అరెస్టు చేశారు. వారు నలుగురు శిఖరం అంచున నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
మలేషియాకు చెందిన కినబాలు పర్వతాన్ని స్థానిక ప్రజలు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇటీవల అక్కడ భూకంపం వచ్చింది.
ఈస్టర్న్ మలేషియన్ స్టేట్ ఆఫ్ సబా పోలీసు కమిషనర్ జలాలుద్దీన్ అబ్దుల్ రెహ్మాన్ మాట్లాడుతూ.. నలుగురిని మంగళవారం అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ఆరుగురు అలాగే చేశారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. అరెస్టైన వారి పైన పబ్లిక్ న్యూసెన్స్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని తెలుస్తోంది.

జలాలుద్దీన్ మాట్లాడుతూ.. కినబాలు పర్వతం వద్ద గత శుక్రవారం నాడు 5.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని, ఈ ఘటనలో అదృశ్యమైన సింగపూర్ వాసులు మృతి చెందినట్లుగా నిర్ధారించినట్లు చెప్పారు.
భూకంపం రావడానికి కొద్ది రోజుల ముందు విదేశాలకు చెందిన పలువురు పర్యాటకులు శిఖరం పైన దుస్తులు విప్పి నగ్నంగా ఫోటోలు తీసుకున్నారని, అందుకే భూకంపం వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నలుగురిని మంగళవారం అరెస్టు చేశారు. మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications