భవిష్యత్ అగమ్యగోచరం: ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లడంపై సీఈఓ పరాగ్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: బిలియనీర్ ఎలాన్ మస్క్ చేతికి సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ వెళ్లడంపై ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ స్పందించారు. ట్విట్టర్ భవిష్యత్తు ఏంటో అర్థకావడం లేదని ఆయన సంస్థ ఉద్యోగులతో చెప్పారు. సంస్థ కొనుగోలు ఒప్పందం ముగిసే వరకు తానే సీఈఓగా ఉంటానన్నారు. అప్పటివరకు ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
ట్విట్టర్లో పరిస్థితి ఎలా ఉంటుందో: పరాగ్ అగర్వాల్
ప్రస్తుతం సంస్థలో ఎవరినీ తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు పరాగ్ అగర్వాల్. ఎలాన్ మస్క్ యజమాని అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని, ప్రస్తుతం సంస్థ వద్ద అన్నింటికీ సమాధానాలు లేవని తెలిపారు. కొనుగోలు ఒప్పందం ముగిసే వరకు తానే సీఈఓ పదవిలో కొనసాగుతానని ఉద్యోగులకు పరాగ్ హామీ ఇచ్చారు.
పరాగ్ అగర్వాల్ను తొలగించాలంటూ 42 మిలియన్ డాలర్ల పరిహారం
ట్విట్టర్తో ఎలాన్ మస్క్ డీల్ పూర్తయ్యే సరికి కనీసం 3నెలల నుంచి 6 నెలలు పట్టవచ్చని అంచనా వేశారు పరాగ్. ఒకవేళ పరాగ్ను సీఈఓ పదవి నుంచి తొలగించాలంటే ఆయనకు 42 మిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని పరిశోధనా సంస్థ ఈక్విలార్ తెలిపింది. ప్రక్రియ ముగిసిన తర్వాత ట్విట్టర్ ప్రైవేటు కంపెనీగా మారి బోర్డు రద్దవుతుందని బోర్డులోని సభ్యుడు ఒకరు తెలిపారు.
పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన 6 నెలలకే..
కాగా, ట్విట్టర్ సీఈఓగా 2021 నవంబర్లో బాధ్యతలు చేపట్టారు భారత సంతతికి చెందిన 37ఏళ్ల పరాగ్ అగర్వాల్. ఇప్పుడు 6 నెలలు కూడా పూర్తి కాకుండానే సంస్థ ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్తోంది. దీంతో పరాగ్ భవిష్యత్పై కూడా అనిశ్చితి నెలకొంది. ఆయనను సీఈఓగా కొనసాగించేందుకు మస్క్ ఆసక్తి చూపుతారో లేదో మరికొన్ని రోజుల్లో తెలిసిపోనుంది. ట్విట్టర్ను మస్క్ 44 బిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేశారు. ఎప్పట్నుంచో ట్విట్టర్ ను దక్కించుకునేందుకు ప్రయత్నించిన ఎలాన్ మస్క్ చివరకు విజయం సాధించారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ చేతిలో ట్విట్టర్ పాలసీలు మారతాయా? ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్లో ఎడిట్ ఆప్షన్ తీసుకురావాలని ఎలాన్ మస్క్ సూచించిన విషయం తెలిసిందే.