శ్రీలంకలో సంక్షోభం వెనుక షాకింగ్ కారణాలు-రాజీనామా లేఖలో గోటబాయ వివరణ..
శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభంగా మొదలై రాజకీయ సంక్షోభంగా మారి శాంతి భద్రతలు కూడా లేకుండా చేస్తున్న పరిస్దితులపై సింగపూర్ కు పారిపోయిన మాజీ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స తాజాగా వివరణ ఇచ్చారు. సింగపూర్ నుంచే తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపిన గోటబాయ.. ఇందులో దేశంలో సంక్షోభానికి గల కారణాల్ని కూడా వివరించారు. ఇవి చూస్తుంటే అచ్చం భారత్ లోనూ రాజకీయ నేతలు తమ తప్పుల్ని పాత ప్రభుత్వాలపైకి నెట్టేస్తున్నట్లే ఉన్నాయి.
దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని తప్పించేందుకు శతవిధాల ప్రయత్నం చేశానని గోటబాయ స్పీకర్ కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తాను పదవి చేపట్టక ముందే ఏళ్ల తరబడి కొనసాగిన ఆర్థిక అవకతవకల వల్లే ఇది జరిగిందని ఆరోపించారు. కొన్నేళ్లుగా అసమర్థ పాలన, ఆర్థిక అవకవతకల కారణంగానే దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని గోటబాయ ఆక్షేపించారు. దాంతో పాటు కోవిడ్-19 శ్రీలంక పర్యాటకాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని వివరించారు. కోవిడ్ కారణంగా విదేశీ పర్యాటకులు రాకుండాపోయారన్నారు. ఆ సంక్షోభాన్ని తప్పించేందుకు.. సమైఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విపక్షాలను ఆహ్వానించటం సహా అన్ని రకాల చర్యలను చేపట్టానని నమ్ముతున్నట్లు తన లేఖలో గోటబాయ పేర్కొన్నారు.
శ్రీలంకలో ముందుగా విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోవడంతో సంక్షోభం మొదలైంది. అక్కడి నుంచి పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసరాల కొరత ఏర్పడింది. డిమాండ్ కు తగినట్లుగా ప్రభుత్వం విదేశాల నుంచి కొనుగోళ్లు చేయకపోవడంతో సంక్షోభం మరింత ముదిరింది. దీంతో ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతూ పోయింది. భారీ రేట్లు పెట్టి వస్తువులు కొనలేక జనం గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. చివరికి ఈ పరిస్ధితికి కారణమైన రాజపక్సే సోదరుల్ని ఒక్కొక్కరిగా పదవి నుంచి దిగిపోయేలా చేశారు. దీంతో ప్రజలకు భయపడి గోటబాయ దేశం వదిలిపారిపోయారు. మో ఇద్దరు సోదరుల్ని సుప్రీంకోర్టు..దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించింది.