ఒకేసారి అన్ని పేజర్లు ఎలా పేలాయ్: 5,000 మందికి పైగా గాయాలు: సినిమాటిక్ ట్విస్టులు
Lebanon Pagers blast: లెబనాన్లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. పేజర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది హెజ్బొల్లా ఉగ్రవాదులు, సానుభూతిపరులు దుర్మరణం పాలయ్యారు. 5,000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతున్న స్థితిలో ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు.
వారిలో చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ ఘటనతో మధ్య- తూర్పు దేశాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ పేలుడుకు ఇజ్రాయెల్ ప్రధాన కారణమంటూ లెబనాన్ మండిపడుతోంది.

తొలుత రాజధాని బీరుట్ దక్షిణ ప్రాంతంలో ఉన్నట్టుండి పేజర్లు పేలిపోయాయి. హెజ్బొల్లాకు గట్టిపట్టు ఉన్న ప్రాంతం ఇది. ఆ తరువాత దేశవ్యాప్తంగా పలు చోట్ల పేజర్ల పేలుళ్లు సంభవించాయి. వరుసగా ఒక్కో ప్రాంతంలో అనుమానాస్పద మెసేజ్ అందుకున్న ప్రతి పేజర్ కూడా భారీ శబ్దం చేస్తూ పేలిపోయాయి. మొత్తంగా 1,500లకు పైగా పేజర్లు పేలిపోయినట్లు లెబనాన్ వెల్లడించింది.
ఈ ఘటనలో పేజర్ల యూజర్లు, ఆ సమయంలో వారితో పాటు ఉన్న వాళ్లు, సానుభూతిపరులు.. ఇలా 4,000 మందికి పైగా గాయపడ్డారు. తొమ్మిది మంది సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ ఘటన పట్ల లెబనాన్ ఘాటుగా స్పందించింది. దీనికి ఇజ్రాయెల్ కారణమంటూ ఆరోపించింది. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. తమ దేశ సెక్యూరిటీ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేలా ఇజ్రాయెల్ వ్యవహరించిందంటూ మండిపడింది.
అన్ని పేజర్లు ఒకే సమయానికి ఎలా పేలాయ్ అనేది ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. అవన్నీ కూడా ఏపీ924 రకానికి చెందినవి. వాటిని తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో అనే సంస్థ తయారు చేసింది. ఈ ఏడాద్రి ఏప్రిల్- మే మధ్యకాలంలో హెజ్బొల్లా వాటిని కొనుగోలు చేసింది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయడానికి తమ సంస్థకు చెందిన మిలిటెంట్లకు వాటిని అందజేసింది.
ఈ పేజర్లను ఒకేసారి పేల్చేయడానికి అప్పుడే కుట్ర జరిగిందనే కథనాలు వెలువడుతున్నాయి. పెంటాఎరిథ్రిటాల్ టెట్రానైట్రేట్ (Pentaerythritol Tetranitrate-PETN) అనే అధిక తీవ్రత గల పేలుడు పదార్థాన్ని ఇందులో అమర్చారని లెబనాన్ జాతీయ భద్రతాధికారి ఒకరు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ, స్కై న్యూస్-అరేబియాకి తెలిపారు.
ఈ పీఈటీఎన్ను గుర్తించడం దాదాపుగా అసాధ్యమని, ఎలాంటి స్కానర్లు, డివైస్ల కంటికీ అది చిక్కదని అన్నారు. ఒక్కో పేజర్లో 20 గ్రాముల బరువు ఉండే పీఈటీఎన్ను మొస్సాద్ అమర్చి ఉండొచ్చని అల్ జజీరా ఛానల్ అంచనా వేసింది. రిమోట్ ద్వారా పీఈటీఎన్ పేలిపోయేలా ఆపరేట్ చేసి ఉండొచ్చని అభిప్రాయపడింది.
పీఈటీఎన్ను టీఎన్టీ కంటే శక్తిమంతమైన పేలుడు పదార్థంగా భావిస్తారు. దీని రిలేటివ్ ఎఫెక్టివ్నెస్ ఫ్యాక్టర్ 1.66. పారిశ్రామిక అవసరాల కోసం ఎక్కువగా దీన్ని వినియోగిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో దీని వినియోగం అధికమైంది. ఉగ్రవాదులకు ఇదొక శక్తిమంతమైన ఆయుధంగా మారింది.
1996లో తొలిసారిగా సౌదీ అరేబియాలో ఖోబర్ టవర్స్ను పేల్చివేయడానికి తొలిసారిగా ఈ పీఈటీఎన్ను వినియోగించారు. ఆ ఘటనలో 19 మంది అమెరికన్లు దుర్మరణం పాలయ్యారు. వందలాదిమంది గాయపడ్డారు. ఇప్పుడు హిజ్బొల్లాను మట్టుబెట్టడానికి మొస్సాద్ ఇదే ఆయుధాన్ని ప్రయోగించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.












Click it and Unblock the Notifications