Year Ender 2025: ఈ ఏడాది భారత్ కు ట్రంప్ టార్చర్..! మనోళ్లకు వరుస షాక్ లు..!
ఈ ఏడాది ఆరంభంలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు భారత్ కు ఆశాజనకంగా ఉంటుందని, కనీసం ప్రధాని మోడీతో ఉన్న సంబంధాల నేపథ్యంలో అక్కడి భారతీయులకు ఇబ్బందులు అయితే ఉండకపోవచ్చని అంతా భావించారు. కానీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే ట్రంప్ భారత్ కు చుక్కలు చూపించడం ప్రారంభించారు. వరుస నిర్ణయాలతో భారత్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. అమెరికా కంటే ఏదీ ఎక్కువ కాదని చూపించేశారు.
అమెరికా అధ్యక్ష హోదాలో రెండోసారి పనిచేస్తున్న డొనాల్డ్ ట్రంప్ వచ్చీ రాగానే భారత్ సహా విదేశీ వలసలపై ఉరమడం ప్రారంభించారు. అక్రమ వలసల గుర్తింపు, బహిష్కరణలతో మొదలైన ఈ తంతు.. ఈ తర్వాత సక్రమంగా అమెరికాకు వెళ్లి ఏళ్లతరబడి అక్కడే ఉంటున్న భారతీయుల వరకూ వచ్చేసింది. నిరంతరం తనిఖీలు, దొరికితే జైల్లోపెట్టడం, స్వదేశానికి పంపేయడం వంటి తీవ్ర చర్యలకు దిగారు. అలాగే భారతీయులకు కొత్తగా వీసాలు ఇవ్వడం ఆపేశారు. ఉన్న వీసాలపై తనిఖీలు చేపట్టారు. దీంతో అమెరికాలో తొలిసారి భారతీయులకు భయం అంటే ఏంటో తెలిసొచ్చింది.

మరోవైపు భారత్-పాక్ మధ్య యుద్దం జరిగితే మధ్యవర్తిత్వం అంటూ దూరి కాల్పుల విరమణ తానే చేయించానంటూ బీరాలు పలికిన ట్రంప్.. ఆ వాదన మోడీ అంగీకరించకపోయే సరికి మంటతో ఉడికిపోయారు. అదే సమయంలో రష్యా నుంచి డిస్కౌంట్ చమురును కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారంటూ ఆరోపించి ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. దీంతో భారత్ ఎగుమతి చేసే దుస్తులు, మందులు, రత్నాలు, ఆభరణాలు, పెట్రోకెమికల్ ఉత్పత్తులు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.రష్యా చమురు కొనుగోళ్లు పూర్తిగా ఆపాలన్న ట్రంప్ షరతును భారత్ అంగీకరించలేదు.

ట్రంప్ నిర్ణయాలతో డాలర్ బలపడటంతో మన రూపాయి విలువ భారీగా పడిపోయింది. తాజాగా డాలర్ తో పోలిస్తే ఇది 94 రూపాయలకు చేరుకుంది. మరోవైపు భారత్ రష్యాకు మద్దతుగా ఉన్న తమ వైఖరికి కట్టుబడటంతో సుంకాలతో పాటు ఇతర విషయాల్లోనూ ట్రంప్ వైఖరిలో మార్పు లేకుండా పోతోంది. ఓవైపు ఇరుదేశాల వాణిజ్య చర్చలు సుదీర్ఘంగా కొనసాగుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో అయినా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అంచనా వేస్తున్నారు. ఇతర విషయాల్లో మాత్రం ఊరట దక్కేలా లేదు.












Click it and Unblock the Notifications