రాఫెల్ పై రాహుల్ గాంధీలా నాకు అబద్దాలు చెప్పాల్సిన పనిలేదు: దసాల్ట్ సీఈఓ ఎరిక్
ఫ్రాన్స్ : దేశాన్ని రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం అంశం కుదిపేస్తోంది. ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు సంధిస్తున్నారు. అయితే రాహుల్ విమర్శలను కొట్టి పారేశారు దసాల్ట్ ఏవియేషన్ సంస్థ సీఈఓ ఎరిక్ ట్రాపియర్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఎరిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. దసాల్ట్ రిలయన్స్ గ్రూపు కలయికపై అన్నీ అవాస్తవాలను రాహుల్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని అది కూడో సీఈఓ లాంటి ఓ బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి అవాస్తవాలు చెప్పాల్సిన పని తనకు లేదని వెల్లడించారు ఎరిక్.
అనిల్ అంబానీ కంపెనీలోకి దసాల్ట్ రూ. 284 కోట్లు పెట్టుబడి పెట్టింది: రాహుల్
నవంబర్ 2న మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ నష్టాల్లో ఉన్న అనిల్ అంబానీ కంపెనీలోకి దసాల్ట్ కంపెనీ రూ. 284 కోట్లు పెట్టుబడులు పెట్టిందని ఆరోపించారు. ఇందుకోసం నాగ్పూర్లో భూమిని కూడా కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుందని చెప్పారు. దీంతో దసాల్ట్ సీఈఓ అబద్దాలు చెబుతున్నారని స్పష్టమైందన్న రాహుల్ గాంధీ... ఒకవేళ ఆయనపై విచారణ జరిపితే మోడీ గురించిన నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇదిలా ఉంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన అనుభవం దసాల్ట్ కంపెనీకి ఉందని... కానీ ఇప్పుడు రాహుల్ ఆరోపణలు చేయడం నిజంగా బాధ కలిగించిందని ఎరిక్ ట్రాపియర్ తెలిపారు.
నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలోనే భారత్తో తొలి ఒప్పందం: ఎరిక్
దసాల్ట్ కంపెనీకి కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉందని ఎరిక్ గుర్తుచేశారు. 1953లో నాడు భారత ప్రధానిగా నెహ్రూ ఉన్న సమయంలోనే తొలి ఒప్పందం కుదిరిందని చెప్పిన ఎరిక్... ఇక అప్పటి నుంచే భారత్తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. దసాల్ట్ కంపెనీ ఏ ఒక్క పార్టీ కోసము పనిచేయడంలేదని... కేవలం తమ ఉత్పత్తులను మాత్రమే భారత ఎయిర్ ఫోర్స్కు లేదా భారత ప్రభుత్వానికి అందజేస్తున్నామని ఎరిక్ చెప్పారు. ఇక అనిల్ అంబానీ కంపెనీకి యుద్ధ విమానాలు తయారు చేసిన అనుభవం లేకున్నప్పటికీ ఆ సంస్థలోకి పెట్టుబడులు ఎలా పెడుతున్నారనే ప్రశ్నకు .... అనిల్ అంబానీ దసాల్ట్ సంస్థలు కలిపి ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాయని ఎరిక్ చెప్పారు. దసాల్ట్ కంపెనీకి చెందిన ఇంజనీర్లు విమానాలను తయారు చేస్తారని అదే సమయంలో రిలయన్స్ సంస్థ కూడా విమానాలను ఎలా తయారు చేయాలో నేర్చుకుంటుందని ట్రాపియర్ వెల్లడించారు.
రాఫెల్ యుద్ధ విమానాల ధరలను 9శాతం తగ్గించే ఇస్తున్నాం
ఇక కంపెనీలో రూ. 800 కోట్లు పెట్టుబడులు పెట్టాల్సి ఉందని... అది కూడా అనిల్ అంబానీ కంపెనీ 50శాతం దసాల్ట్ కంపెనీ 50 శాతం పెట్టుబడులు పెట్టాల్సి ఉండగా... ప్రస్తుతం పని మొదలైంది కాబట్టి 40 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఎరిక్ స్పష్టం చేశారు. ఇది కూడా ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకే అని వివరణ ఇచ్చారు. త్వరలోనే 800 కోట్లు పెట్టుబడులు పెడతామని తమ వాటాగా రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు దసాల్ట్ సీఈఓ చెప్పారు. ఇక పనివిషయానికొస్తే ఏడేళ్లలోపు మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. మొదటి మూడేళ్లలో తాము ఏయే కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామనే సంగతి బహిర్గతం చేయకూడదు. ఇప్పటికే పని ప్రారంభమైందని చెప్పిన ఎరిక్ 30 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. ఇక ధరల విషయానికొస్తే ఇప్పుడు విమానాల ధరలను 9శాతం తగ్గించే ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇది రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం కాబట్టి ఆమేరకు ధరలు తగ్గించినట్లు చెప్పారు.
టాటా సంస్థతో కూడా ఒప్పందం పై చర్చలు జరిపాం
తొలిసారి ఒప్పందం చేసుకున్నప్పుడు హాల్ కాదని రిలయన్స్ కంపెనీ వైపు ఎందుకు మొగ్గు చూపారన్న ప్రశ్నకు ఎరిక్ సమాధానం ఇచ్చారు. 126 విమానాల ఒప్పందం స్మూత్గా జరిగి ఉంటే హాల్తో కలిసి పనిచేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదని... అయితే అడుగు అడుగుకు అడ్డంకులు ఎదురువుతుండటం.. తొలినాళ్లలో హాల్ కూడా ఆసక్తి చూపకపోవడంతో రిలయన్స్ వైపు మొగ్గు చూపామని ఎరిక్ చెప్పారు. రిలయన్స్ తో ఒప్పందం కంటే ముందే టాటా లాంటి సంస్థలతో కూడా చర్చలు జరిపినట్లు ఎరిక్ చెప్పారు. టాటా కూడా ఇతర సంస్థలతో చర్చలు జరిపిందని గుర్తు చేశారు.2011లో నిర్ణయం తీసుకునే హక్కు దసాల్ట్ కంపెనీకి ఉండేది కాదని వివరించిన ఎరిక్ ఆ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో అనిల్ అంబానీ కంపెనీ వైపు మొగ్గు చూపినట్లు తెలిపారు. అనిల్ అంబానీ కంపెనీకి పలు ప్రాజెక్టులు చేసిన అనుభవంను దృష్టిలో ఉంచుకుని ఈ డీల్ను ఫిక్స్ చేయడం జరిగిందని తెలిపారు.
ఒక్క ఆయుధాలు తప్ప అన్ని సదుపాయాలు రాఫెల్లో ఉంటాయి
ఇక రాఫెల్ యుద్ధ విమానం గురించి మాట్లాడిన దసాల్ట్ సీఈఓ.. ప్రస్తుతం తయారు చేస్తున్న యుద్ధ విమానాల్లో అన్ని సదుపాయాలు ఉంటాయని అయితే ఆయుధాలు, క్షిపణి వ్యవస్థ మాత్రం ఉండదని వెల్లడించారు. ఆయుధాలు మరో ఒప్పందం ప్రకారం పంపబడుతాయని స్పష్టం చేశారు. ఒక్క ఆయుధాలు మినహాయిస్తే అన్ని సదుపాయాలతో రాఫెల్ యుద్ధ విమానాలను దసాల్ట్ చేరవేసే బాధ్యత తీసుకుంటుందని సీఈఓ ఎరిక్ స్పష్టం చేశారు.