అభినందన్ రిలీజ్: భారత్ నాకు తెలుసు.. పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ పూర్తి స్పీచ్, ఎల్టీటీఈ ప్రస్తావన
ఇస్లామాబాద్: పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను రేపు (శుక్రవారం) విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ గురువారం తెలిపారు. అంతకుముందు అభినందన్ను విడుదల చేయడానికి తాము సిద్ధమని పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి తెలిపారు. ఆ తరువాత ఇమ్రాన్ ప్రకటన చేశారు.
మోడీకి చెప్పే ప్రయత్నం చేశా
ఈ మేరకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ పార్లమెంటులో ప్రసంగించారు. తాను భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ సందేశం ఇచ్చేందుకు నిన్న (బుధవారం) అతనిని సంప్రదించే ప్రయత్నాలు చేశానని, ప్రస్తుత పరిణామాల వల్ల అటు భారత్కు, ఇటు పాకిస్తాన్కు ఎలాంటి లాభం ఉండదని చెప్పే ప్రయత్నాలు చేశానని అన్నాడు.
భారత్ గురించి నాకు తెలుసు
ఓ క్రికెట్ ఆటగాడిగా భారత్ గురించి తనకు తెలుసునని, అక్కడ (భారత్)లో తనకు స్నేహితులు కూడా ఉన్నారని ఇమ్రాన్ ఖాన్ అన్నాడు. అక్కడి ప్రభుత్వం వ్యూహాలను (రాజకీయ వ్యూహాలు అనే ఉద్దేశ్యంలో) భారతదేశంలోని ఎక్కువ మంది ప్రజలు అంగీకరించరని, తాము చేసింది తప్పు అని భారత ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పాడు.
ఎక్కువ ఆత్మాహుతి దాడులు తమిళ టైగర్స్ చేసింది
9/11కు ముందు మతపరమైన ఆత్మాహుతి దాడులు జరగలేదని ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు. అతి ఎక్కువ ఆత్మాహుతి దాడులు తమిళ టైగర్స్ (ఎల్టీటీఈ) వల్ల జరిగాయని అతను చెప్పాడు. తమిళ టైగర్స్ హిందూ కమ్యూనిటీకి చెందినవారు అన్నాడు. వారివి కూడా మతపరమైన దాడులు కాదని, వారికి జరిగిన అన్యాయంపై నిరాశ, ఒత్తిడిలో అలా చేశారని చెప్పాడు. టిప్పు సుల్తాన్ తమ హీరో అన్నాడు.
చివరలో... అభినందన్ను విడుదల చేస్తాం
తాను నిన్న (బుధవారం) సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేశానని ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు. అలాగే తాను టర్కిష్ అధ్యక్షుడితోను మాట్లాడానని చెప్పాడు. అయితే ఇది తమ బలహీనతగా చూడవద్దని చెప్పాడు. ఇది మరింత ముందుకు తీసుకెళ్లవద్దని, తమ దేశంలోకి చొచ్చుకొచ్చి దాడి చేసినందున తాము చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. అనంతరం ఇమ్రాన్ ఖాన్ చివరలో... పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ను రేపు విడుదల చేస్తామని చెప్పారు.