పాకిస్తాన్లో పుల్వామా తరహా ఉగ్ర దాడి: బస్సు తునాతునకలు: చైనా ఇంజినీర్లు, సైనికులు దుర్మరణం
ఇస్లామాబాద్: కత్తి పట్టుకున్న వాడు ఆ కత్తికే బలి అవుతాడనే సామెత.. ప్రస్తుతం పాకిస్తాన్ విషయంలో నిజమౌతున్నట్లే కనిపిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పొరుగు దేశం.. అదే ఉగ్రవాదం దెబ్బను రుచి చూస్తోంది. మరోసారి ఉగ్రవాదులు పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. భారీ విధ్వంసానికి తెగబడ్డారు. ఇంప్రువైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)తో బస్సుపై దాడి చేశారు. ఈ ఘటనలో 10 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో ఎక్కువమంది చైనాకు చెందిన ఇంజినీర్లు ఉన్నారు.
పాకిస్తాన్ ఉత్తర ప్రాంతంలో ఈ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్స్లోని ఎగువ కోహిస్తాన్లో చైనా ఇంజినీర్లు, సైనికులతో వెళ్తోన్న బస్సులో ఈ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 30 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రతను బట్టి చూస్తోంటే- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తోన్నాయి. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, భద్రతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి పుల్వామా ఘటనను పోలి ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

హజారా రీజియన్, ఎగువ కోహిస్తాన్ ప్రాంతంలో ఉన్న దసు రిజర్వాయర్, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. ఇది చైనా-పాకిస్తాన్ ఉమ్మడి ప్రాజెక్ట్. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్లో భాగంగా రెండు దేశాలు సంయుక్తంగా దీన్ని చేపట్టాయి. కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణంలో చైనా పెట్టుబడుల వాటా 65 బిలియన్ డాలర్లు. పాకిస్తాన్ దక్షిణ ప్రాంతంలోని గ్వాడర్ ఓడరేవు వరకు ఈ కారిడార్ను నిర్మించాల్సి ఉంది. ఇందులో భాగంగా దసు హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ను చేపట్టాయి రెండు దేశాలు. ఉమ్మడి ప్రాజెక్ట్ కావడం వల్ల హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణంలో చైనాకు చెందిన ఇంజినీర్లు, ఇతర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పని చేస్తోన్నారు.
ఈ ఉదయం ఎప్పట్లాగే తాము బస చేసిన ప్రదేశం నుంచి బస్సులో హైడ్రోఎలక్ట్రిక్ నిర్మాణ ప్రాజెక్ట్ వద్దకు చైనా ఇంజినీర్లు ఓ బస్సులో బయలుదేరి వెళ్తోన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నందున.. పాకిస్తాన్ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా ఈ బస్సుకు పారామిలటరీ బలగాలతో భద్రతను కల్పించింది. అయినప్పటికీ- దాడిని మాత్రం నివారించలేకపోయింది. పేలుడు సంభవించిన వెంటనే బస్సు రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి విసిరేసినట్టు పడిపోయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని ఉగ్రవాద దాడిగా భావిస్తోన్నారు.












Click it and Unblock the Notifications